అయోధ్య : రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించినట్టు ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. సోమవారం జరిగిన ట్రస్ట్ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన వెల్లడించారు. ట్రస్ట్ రాజ్యాంగం ప్రకారం రాజీనామా సమర్పించిన క్షణంలోనే దాన్ని ఆమోదించినట్టు పరిగణిస్తారు. చంపత్ రాయ్ స్థానంలో తాత్కాలిక కార్యదర్శిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణ మోహన్ను ట్రస్ట్ నియమించింది. ఆయనను ఇటీవలే ఒక ట్రస్టీగా ట్రస్ట్లోకి చేర్చుకొన్నారు.
యూపీలోని హర్దొయ్ జిల్లాకు చెందిన కృష్ణ మోహన్ దళిత వర్గానికి చెందినవారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. ట్రస్ట్ నిర్వహణ, కార్యకలాపాల్లో లోపాలను గుర్తించినట్టు కృష్ణ మోహన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ లోపాలు పునరావృతం కాకుండా పరిపాలన ప్రక్రియను బలోపేతం చేస్తూ, లోపాలను తొలగించడానికి తాను తక్షణ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాజా వివాదం ప్రజల్లో ట్రస్ట్ ప్రతిష్టను దెబ్బ తీసిందని.. భక్తులు, సమాజంలో విశ్వాసాన్ని సన్నగిల్లచేసిందని ఆయన అంగీకరించారు.
అయోధ్య రామాలయం విరాళాల చోరీ తనను ఎంతగానో కలచి వేసిందని ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ అన్నారు. అయితే దీన్నెవరూ రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ ఉదంతంలో సరైన చర్యలు తీసుకొంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గోపాల్ దాస్ ఈ విషయాలపై రాసిన ఒక లేఖను ఏఎన్ఐ ఎక్స్లో షేర్ చేసింది. ‘పాపం చేసిన వారికి కఠిన శిక్ష పడాలి. ఇది కోట్లాది హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం. దీన్ని ఎవరూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయం చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అని దాస్ తన లేఖలో పేర్కొన్నారు.