Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. భూ కుంభకోణం కేసులో ఈడీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్భవన్కు చేరుకొని గవర్నర్కు రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామా నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా శాసన సభ్యులు రాజ్భవన్కు చేరుకున్నారు.
జేఎంఎం ఎమ్మెల్యేల వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. రాజీనామా నేపథ్యంలో చంపై సోరెన్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు సమాచారం. జార్ఖండ్ సీఎం విచారణ ఈడీ విచారణ నేపథ్యంలో రాంచీలోని రాజ్భవన్, సీఎం నివాసం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ను విధించారు. సీఎం సోరెన్ నివాసం ఆవరణలోకి రెండు మినీ బస్సులు తీసుకువచ్చారు. అలాగే పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.
ల్యాండ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో విచారిస్తుండగా.. ఈడీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. హేమంత్ సోరెన్ను ఇదే కేసులో గతంలో జనవరి 20న ప్రశ్నించగా.. ఆ రోజు విచారణ పూర్తి కాలేదని ఓ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఆయనను ఏడుగంటలకుపైగా విచారించారు. జార్ఖండ్లో ‘మాఫియా భూ యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే పెద్ద రాకెట్’ దర్యాప్తులో భాగంగా సోరెన్ను విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. చంపై సోరెన్ను శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నామని జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా వెల్లడించారు. బన్నా గుప్తా సైతం రాజ్భవన్కు చేరిన వారిలో ఉన్నారు. చంపై సోరెన్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని కోరుతామని చెప్పారు.
భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది కార్మికులు, అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. రాంచీలోని మోర్హబడి మైదానంలో భేటీ అయ్యారు. హేమంత్ సోరెన్ను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని మద్దతుదారులు ఆరోపించారు. జంషెడ్పూర్ నుంచి రాంచీకి చేరిన జేఎంఎం నేత జర్నా పాల్ మాట్లాడుతూ హేమంత్ సోరెన్ గిరిజనుడు కావడంతోనే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఆయన తమకు దేవుడిలాంటివాడని.. ఆయన కోసం ఎంతవరకైనా వెళ్లొచ్చన్నారు. ఆయన జైలుకు వెళితే.. తాము కూడా ఆయన వెంట వెళ్తామన్నారు.