న్యూఢిల్లీ, నవంబర్ 26: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులు శనివారం అన్ని రాష్ర్టాల్లో ‘చలో రాజ్భవన్’ నిర్వహించారు. 25 రాష్ర్టాల రాజధానుల్లో లాంగ్మార్చ్లు, ర్యాలీలు నిర్వహించినట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఓ ప్రకటనలో పేర్కొన్నది. 300కు పైగా జిల్లా కేంద్రాలు, అనేక మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో రైతులు వేలాదిగా పాల్గొని కదం తొక్కారు. ఎంఎస్పీకి చట్టబద్ధత, విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరణ, రైతులపై కేసుల ఉపసంహరణ తదితర హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ ద్రోహాన్ని నిరసించారు. హామీలు నెరవేర్చకుంటే మరో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
5 లక్షల మంది హాజరు..
హైదరాబాద్తోపాటు చండీగఢ్, లక్నో, పాట్నా, కోల్కతా, తిరువనంతపురం, చెన్నై, భోపాల్, జైపూర్ తదితర రాష్ట్ర రాజధానుల్లో జరిగిన ‘చలో రాజ్భవన్’ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది పాల్గొన్నారని ఎస్కేఎం పేర్కొన్నది. కార్మికులు, యువత, మహిళలు, సాధారణ ప్రజలు రైతులకు మద్దతు పలుకుతూ వారితో కాలు కదిపారని, 3 వేలకు పైగా ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయని తెలిపింది. రైతుల డిమాండ్లతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకొనేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ర్టాల గవర్నర్ల ద్వారా మెమోరాండం సమర్పించినట్టు ఎస్కేఎం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం మోసం: టికాయిత్
డిమాండ్లను నెరవేర్చకుంటే మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఎస్కేఎం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన మహాపంచాయత్ను ఉద్దేశించి బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ మాట్లాడుతూ మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతాంగ డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇచ్చిన కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు.