బెంగళూరు, జూన్ 6: కర్ణాటకలో కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య చెడ్డీ వార్ నడుస్తున్నది. బడి పుస్తకాలను కాషాయీకరణ చేస్తున్నారంటూ ఇటీవల కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాకీ నిక్కర్కు నిప్పు పెట్టారు. దీనిపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు మంత్రి ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దీనికి స్పందనగా కాంగ్రెస్ నిరసనలను ఉద్ధృతం చేయాలని, కూడళ్లలో ఖాకీ నిక్కర్లను కాల్చివేయాలని ప్రచారం ప్రారంభించింది. సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు పలు చోట్ల నిక్కర్లను కాల్చి నిరసనలు తెలిపారు. దీనికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు విచిత్రమైన క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి డ్రాయర్లు సేకరిస్తున్నారు. వాటిని డబ్బాల్లో కాంగ్రెస్ నేతలకు పంపిస్తున్నారు.