ముంబై: బాలివుడ్ నటి కంగనా రనౌత్కు కేంద్రం కల్పించిన భద్రత ఆమెను కేసు నుంచి కాపాడలేదని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ‘సిక్కు సంఘం కంగనా రనౌత్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. గొప్ప నాయకులను అవమానించడం ఆమెకు అలవాటు కాబట్టి ఇది చాలా సందర్భోచితం. ఎవరూ చట్టానికి అతీతులు కాదు. కేంద్రం నుండి ఆమెకు అందుతున్న భద్రత కూడా సహాయపడదు’ అని మీడియాతో మాలిక్ అన్నారు.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల పక్రటించిన తర్వాత నటి కంగనా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. సిక్కులను ‘ఖలిస్తానీలు’గా పోల్చారు. కాగా, అగౌరవంగా, అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంగనాపై సిక్కు సంఘం కేసు నమోదు చేసింది.
ఢిల్లీ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీజీఎంసీ) అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా, సుప్రీం కౌన్సిల్ నవీ ముంబై గురుద్వారా అధ్యక్షుడు జస్పాల్సింగ్ సిద్ధూ, దాదర్లోని శ్రీ గురుసింగ్ సభ గురుద్వారాకు చెందిన అమర్జీత్ సింగ్ సంధు కంగనాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మాట్లాడే హక్కును దుర్వినియోగం చేసిన కంగనా జైలుకెళ్లే రోజు దగ్గరలోనే ఉన్నదంటూ మంజీందర్ సింగ్ సిర్సా ఒక ట్వీట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసే వరకు తాము పోరాడుతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నవాబ్ మాలిక్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.