సినీ పరిశ్రమను పీడిస్తున్న పలు సమస్యలపై బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ గళం విప్పింది. మహిళలు, అణగారిన వర్గాల హక్కులపై తరచుగా మాట్లాడే షబానా.. తాజాగా, సినిమాల్లో ఐటమ్ సాంగ్స్, అందులో మహిళలను చూపించే విధానంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం కొందరు నటులు సినిమాల్లో ఓ వస్తువుగా మారడానికి ఇష్టపడుతున్నారనీ, మహిళా నటులు వారిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రత్యేక గీతాల వల్ల సమాజంపై పడుతున్న ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. “ఐటమ్ సాంగ్స్లో మహిళా నటులు తమ శరీరాన్ని ఒక వస్తువులా ప్రదర్శిస్తుండటం బాధాకరమైన విషయం! కొందరు దర్శకులు కెమెరా కదలికల ద్వారానే తమ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంటారు.
నటీమణుల శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చూపిస్తుంటారు. ఎద భాగాలు, నడుమును ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంటారు. ఇలా మహిళల శరీర భాగాలను చిత్రీకరించడం.. వారి స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమే!” అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇక ఐటమ్ సాంగ్స్లోని సాహిత్యంపైనా షబానా విమర్శలు గుప్పించింది. అందులోని అర్థాలు తనను తీవ్ర అసహనానికి గురిచేస్తాయని చెప్పింది. “చిన్నపిల్లలు ‘చోళీ కే పీచే క్యా హై’ పాటలు పాడుతున్నారు. పాపం.. అందులోని పదాల అర్థం వారికి తెలియదు కదా! ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదు” అంటూ దుయ్యబట్టింది. “నిజానికి చాలా సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్కు, కథకూ ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం ప్రేక్షకులను ఆకర్షించడానికి మాత్రమే వీటిని పెడుతున్నారు. ఇక కొందరు.. ‘మగవాళ్లు చేస్తున్నప్పుడు మహిళలు చేస్తే తప్పేంటి?’ అని అంటున్నారు. కానీ, మగవారిలా సినిమాల్లో ఓ వస్తువుగా మారాల్సిన అవసరం మహిళా నటీమణులకు లేదు” అంటూ చెప్పుకొచ్చింది. భారత్లో అత్యంత ప్రతిభావంతమైన నటీమణులలో షబానా ఆజ్మీ ఒకరు.
1974లో ‘అంకుర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అద్భుతమైన నటనతో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్నది. జాతీయ అవార్డునూ అందుకున్నది. విలక్షణమైన నటన, అసాధారణమైన పాత్రలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది. 160కి పైగా సినిమాల్లో నటించిన షబానా.. ఉత్తమ నటిగా ఐదు జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నది. వీటితోపాటు ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక ప్రశంసలు అందుకున్నది. ఆమె చివరిసారిగా నెట్ఫ్లిక్స్లో ప్రసారమైన ‘డబ్బా కార్టెల్’లో కనిపించింది.