న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు విఫలమైందంటూ కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దురహంకారం 97 శాతం మంది భారతీయుల ఆదాయంలో తగ్గుదలకు కారణమైందన్నారు. ప్రజలు ఆర్థికంగా అతలాకుతలం అవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన కారణమని, కరోనా వైరస్ మ్యుటెంట్లు రెండో కారణమని చెప్పారు. సెకెండ్ వేవ్ కట్టడికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన లాక్డౌన్ల వల్ల 97 శాతం మంది భారతీయులు పెదరికంలోకి వెళ్లారన్న రిపోర్టును కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్కు జోడించారు.
”ఒక వ్యక్తి, ఆయన దురహంకారం + ఒక వైరస్, దాని మ్యూటెంట్లు” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కోవిడ్ సెకెండ్ వేవ్ వల్ల భారత్లో ఉద్యోగాలపై ప్రభావం కనిపిస్తోందని, ముఖ్యంగా వేతన జీవులపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని రాహుల్ షేర్ చేసిన రిపోర్టులో ఉంది. ఏడాది క్రితంతో పోల్చుకుంటే 97 శాతం దేశ జనాభా ఆదాయం తగ్గినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మహేష్ వ్యాస్ ఇచ్చిన నివేదికను ఆ వార్త కథనం ఉటంకించింది. కొవిడ్కు ముందు సుమారు 85 మిలియన్ ఉద్యోగాలుంటే, ప్రస్తుతం అది 73 నుంచి 74 మిలియన్లకు పడిపోయిందని వ్యాస్ పేర్కొన్నారు.