వందల కోట్లు బయటపడ్డా చర్యల్లేవ్
ఆధారాలు లేకున్నా తెలంగాణపై బీజేపీ నేతల అడ్డగోలు ఆరోపణలు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొన్ని రోజులుగా పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న బీజేపీ నేతలు.. దేశంలోనే మెడికల్ సీట్ల స్కామ్కు కర్ణాటక కేరాఫ్గా ఉన్న సంగతి మర్చిపోతున్నారు. తెలంగాణలో ఆధారాలు లేకపోయినా ప్రభుత్వాన్ని నిందిస్తూ నానా యాగి చేస్తున్నారు. గత మూడేండ్లుగా కర్ణాటకలో ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల స్కాములు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
కొన్ని కాలేజీలు అధికార పార్టీతో కుమ్మక్కై పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాల్సిన అక్కడి ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. దీంతో కోర్టు జోక్యం చేసుకున్నది. ఫలితంగా ఈ స్కామ్ డొంక కదులుతున్నది. – 2019-20లో కర్ణాటకలోని పలు ప్రైవేట్ కాలేజీల్లో 113 మేనేజ్మెంట్ కోటా మెడికల్ పీజీ సీట్లను కౌన్సెలింగ్ నిర్వహించకుండా భర్తీ చేసినట్టు తేలింది. దీనిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసి విచారణకు ఆదేశించింది. నివేదిక ఆధారంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యుడిగా తేలడంతో అతడి పెన్షన్ ప్రయోజనాలను నిలిపివేసింది.
ప్రభుత్వ కోటా సీట్లలోనూ అక్రమం
నీట్తో దేశవ్యాప్తంగా మెడికల్ ప్రవేశాలు పారదర్శకంగా జరుగుతాయని కేంద్రంలోని బీజేపీ పదేపదే చెప్తున్నది. కానీ, బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో 2019లో ప్రభుత్వ కోటా సీట్లను అక్రమంగా ఇన్స్టిట్యూషన్ కోటా సీట్లుగా మార్చిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐటీ అధికారులు ఐదు కాలేజీలపై దాడులు చేసి రూ.300 కోట్లు సీజ్ చేశారు.