న్యూఢిల్లీ: వివిధ సందర్భాల్లో ప్రత్యేక రూపొందించిన నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అలాగే నూతన పార్లమెంటు భవనం (New Parliament Building) ప్రారంభోత్సవం (Inauguration) సందర్భంగా రూ.75 నాణెం (Rs.75 Coin) విడుదల చేయనుంది. పార్లమెంటు భవనం గుర్తుగా దీనిని విడుదల చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ (Ministry of Finance) తెలిపింది. 35 గ్రాముల బరువు, 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉన్న ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్ మిశ్రమాలతో తయారు చేశారు.
నాణేనికి ఒక వైపు అశోక స్తంభం, లయన్ క్యాపిటల్, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అని, కుడివైపున ఇంగ్లిష్లో భారత్ అనే పదం రాశారు. ఇక నాణేనికి రూపాయి చిహ్నం, లయన్ క్యాపిటల్ కింద రాసిన అంతర్జాతీయ అంకెల్లో 75 డినామినేషన్ విలువ కూడా ఉంటుంది. నాణేనికి మరోవైపు పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది.
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ (PM Modi) ఈ నెల 28న ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, కమ్యూనిస్టులు సహా 20 ప్రతిపక్ష పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ కార్యక్రమానికి తాము హాజరవుతున్నట్లు టీడీపీ, శిరోమణి అకాలీదళ్, జేడీయూ, శివసేన, వైసీపీ, శివసేన (షిండే వర్గం), అన్నా డీఎంకే వంటి 25 పార్టీలు స్పష్టం చేశాయి.