న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ప్రధాన ఆహార పదార్థాల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ‘భారత్ రైస్’ పేరుతో ప్రజలకు కిలో బియ్యాన్ని రూ.25 చొప్పున రాయితీ ధరతో అందజేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘భారత్ ఆటా’ పేరుతో గోధుమ పిండిని, ‘భారత్ దాల్’ పేరుతో పప్పులను రాయితీ ధరలతో పంపిణీ చేస్తున్న కేంద్రం.. నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా), ఎన్సీసీఎఫ్ (నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) లాంటి ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్రీయ భాండార్ అవుట్లెట్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా ‘భారత్ రైస్’ను విక్రయించనున్నట్టు తెలుస్తున్నది.