న్యూఢిల్లీ, జనవరి 16: ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్లో తమ పంతాన్ని నెగ్గించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. జడ్జీల నియామకాల్లో తమ పాత్ర ఉండాలని పట్టుబడుతున్నది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ నెల 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాసినట్టు తెలిసింది. జడ్జీలను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు స్థాయిలో ఒకటి, హైకోర్టు స్థాయిలో ఒకటి కమిటీలు వేయాలని ఆయన ఆ లేఖలో సూచించారు.
సుప్రీంకోర్టు స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి ఉండాలని, ఇక హైకోర్టు స్థాయిలో ఏర్పాటుచేసే కమిటీలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, మరొకరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉండాలని పేర్కొన్నారు. ఈ కమిటీలు సరైన అభ్యర్థులను ఎంపిక చేసి వారి వివరాలను కొలీజియంకు అందజేస్తాయని తెలిపారు. ఈ కమిటీల ద్వారా జడ్జీల నియామక వ్యవస్థను క్రమబద్ధం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా ఈ లేఖపై సుప్రీంకోర్టు ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ లేఖ అందినరోజే జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. జడ్జీల బదిలీలకు సంబంధించిన పది ఫైళ్లను కేంద్రం తొక్కి పెట్టిందని ధర్మాసనం మండిపడింది.
ప్రభుత్వ భాగస్వామ్యం కోసం కేంద్రం పట్టు
రాజ్యాంగ నిర్దేశిస్తున్న మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంవోపీ) ప్రకారం ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టు స్థాయిలో వేర్వేరుగా ఉన్న కొలీజియంలు జడ్జీలను ఎంపికచేసి వారి నియామకం కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నాయి. హైకోర్టు స్థాయిలోని కొలీజియానికి స్థానిక హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వం వహిస్తుండగా, ఆయన తరువాత సీనియర్లయిన ఇద్దరు న్యాయమూర్తులు అందులో సభ్యులుగా ఉన్నారు. ఇక హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించే సుప్రీంకోర్టు కొలీజియానికి సీజేఐ నేతృత్వం వహిస్తుండగా, ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జీలు సభ్యులుగా ఉన్నారు. ఇక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులను నియమించే ఐదుగురు సభ్యుల కొలీజియంలో సీజేఐ నాయకునిగా, ఐదుగురు సీనియర్ మోస్ట్ జడ్జీలు సభ్యులుగా ఉన్నారు. ఈ వ్యవస్థల్లో ప్రభుత్వ ప్రతినిధి ఒకరు లేక ఇద్దరు ఉండాలని కేంద్రం సూచిస్తున్నది. ఎంవోపీ ప్రకారం ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కమిటీని ఏర్పాటుచేసేందుకు ఆస్కారం లేదు. అయితే మోదీ సర్కార్ ఏర్పాటు చేసిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్స్మెంట్ కమిషన్ (ఎన్జాక్)ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు 2015లో తీర్పునిచ్చిన సమయంలో ఎంవోపీని సవరించాలని సూచించింది.
న్యాయవ్యవస్థకు విషపు గుళిక
కొలీజియం వ్యవస్థను పునర్నిర్మించాలంటూ కేంద్రమంత్రి లేఖ రాయడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కేంద్రం న్యాయవ్యవస్థకు విషపు గుళికను ఇస్తున్నదని కాంగ్రెస్ మండిపడింది. న్యాయవ్యవస్థను తను స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు బీజేపీ ఒక పథకం ప్రకారం బెదిరింపులకు దిగుతున్నదని విమర్శించింది. న్యాయవ్యవస్థపై ముందుగా ఉపరాష్ట్రపతి దాడి చేస్తున్నాడని, ఆ తరువాత న్యాయశాఖ మంత్రి మాట్లాడుతున్నాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్నారని పేర్కొంది. కొలీజియంలో తన ప్రతినిధులను ప్రవేశపెట్టాలన్న కేంద్రం ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.