న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? గత మూడేండ్ల నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేయడం, అన్ని ప్రాంతాలకు సమానంగా ఆ నోట్లు పంపిణీ కాకపోవడమే ఇందుకు కారణం. సమాచార హక్కు (ఆర్టీఐ) ద్వారా ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన జవాబు ఇదే. 2016 నవంబర్ 8న నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం విదితమే. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో ఆ నోట్ల వాటా 80 శాతానికి పైగానే ఉన్నది.
రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆధ్వర్యంలోని కరెన్సీ ముద్రణాలయాలు నిర్విరామంగా పనిచేసినా అంత భారీ స్థాయిలో కరెన్సీని త్వరగా ముద్రించడం కష్టమే. దీంతో రూ.2 వేల నోట్ల ముద్రణను మొదలుపెట్టిన ఆర్బీఐ.. క్రమంగా ఆ నోట్ల ప్రింటింగ్ను తగ్గించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 35,429.91 కోట్ల రూ.2 వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్.. 2017-18లో 1,115.7 కోట్ల నోట్లను, 2018-19లో కేవలం 466.90 కోట్ల నోట్లను ముద్రించింది. ఆ తర్వాత 2019 నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది.
107 రెట్లు పెరిగిన నకిలీ నోట్లు
2015లో రిజర్వు బ్యాంకు మహాత్మా గాంధీ సిరీస్-2005లో కొత్త నంబరింగ్ సిస్టంతో కూడిన అన్ని డినామినేషన్ల నూతన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీటిలోని సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి. దీంతో అసలు నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య ఉన్న తేడాలను సాధారణ ప్రజలు సైతం సులభంగా గుర్తించగలిగేవారు. కానీ, పెద్ద నోట్లను రద్దుచేసి రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగింది. 2016లో దేశవ్యాప్తంగా 2,272 నకిలీ రూ.2 వేల నోట్లు పట్టుబడ్డాయని, 2020లో వీటి సంఖ్య ఏకంగా దాదాపు 2.45 లక్షలకు చేరినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో వెల్లడించింది.