న్యూఢిల్లీ: దేశంలో ఎల్పీజీ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమైన తర్వాత సరఫరాను స్థిరీకరించామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని దాదాపు 10 శాతం పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆతిథ్య రంగ సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది.
ఈ కమిటీ సరఫరాలో ఏర్పడిన అంతరాయం తీవ్రతను అంచనావేసి హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్లతో చర్చలు జరుపుతుంది. అసలైన వాణిజ్య వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్)కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. కాగా, ఎల్పీజీ అక్రమ నిల్వ, అవకతవకలను నివారించడానికి అదనంగా పాలనాపరమైన చర్యలు చేపట్టినట్లు వర్గాలు తెలిపాయి.
ఎల్పీజీ పంపిణీలో అక్రమాలను కట్టడి చేసి, సజావుగా సరఫరా జరిగేందుకు రీఫిల్ బుకింగ్ కాలాన్ని 21 నుంచి 25 రోజులకు ప్రభుత్వం పెంచిందని వారు తెలిపారు. అక్రమ నిల్వలను అడ్డుకుని, పంపిణీ సజావుగా జరిగేందుకు అత్యవసర వస్తువుల చట్ట నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు వివరించారు. ఎల్పీజీ సరఫరాపై తాత్కాలికంగా కొంత ఆందోళన తలెత్తిందని, కాని ఇప్పుడు సమస్య పరిష్కారమైందని వారు చెప్పారు. సరఫరాను కొనసాగించేందుకు అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు ఒత్తిళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఇంధన సరఫరా నిర్వహణ చాలా మెరుగ్గా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా భారత్కు ఇంధన సరఫరా సజావుగా జరిగేందుకు అనేక దేశాలతో అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని వారు చెప్పారు. సరఫరా గొలుసులో ఆటంకం ఉండకుండా చూసేందుకు సరఫరాదారులతో మంత్రిత్వ శాఖలు, ఇంధన కంపెనీలు సమన్వయం చేసుకుంటున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. భారత్ వద్ద సమృద్ధిగా ఇంధన నిల్వలు ఉన్నాయని, పరిస్థితిని ఎదుర్కొనడానికి భారత్ పూర్తి సన్నద్ధంగా ఉందని వారు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న నిరాధార సమాచారాన్ని ప్రజలు విశ్వసించొద్దని, అటువంటి ప్రచారం ప్రజల్లో అనవసర భయాందోళనకు దారితీయగలదని ప్రభుత్వ వర్గాలు అర్థించాయి.
వాణిజ్య ఎల్పీజీ కొరతపై కొన్ని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ గృహ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకే ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు చెప్పారు. గృహావసరాలు, రవాణా రంగాలకు గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా నేచురల్ గ్యాస్ కేటాయింపును క్రమబద్ధీకరించింది. ఎల్పీజీ ఉత్పత్తి, సీఎన్జీ, పైపుల ద్వారా పంపిణీ చేసే వంటగ్యాస్కు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. తర్వాత ఎరువుల తయారీ ప్లాంట్లకు, ఇతర రంగాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.