(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువసగ్గువకు తెగనమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. గడిచిన ఎనిమిదేండ్లలో డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి రూ. 3.3 లక్షల కోట్లను సమకూర్చిన బంగారు బాతుల వంటి పీఎస్యూలను బలిపీఠంపై పెట్టేందుకు మరోసారి సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్తుల నుంచి అదనపు ఆదాయ మార్గాలేమైనా (మానిటైజేషన్) ఉన్నాయో పరిశీలించాలని ఆయా మంత్రిత్వ శాఖలకు తాజాగా సూచించింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఎకనమిక్ టైవ్ ఓ కథనంలో వెల్లడించింది.
నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్రప్రభుత్వం ఆయా మంత్రిత్వ శాఖలకు సూచించింది. ఎన్ఎంపీ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1.6 లక్షల కోట్లను కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. గడిచిన 7 నెలల్లో రూ.33,443 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మానిటైజ్ చేసింది. దీంతో మానిటైజేషన్ ప్రక్రియలో వెనుకబడిన రైల్వే, టెలికం, పెట్రోలియం తదితర శాఖలపై కేంద్రం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని ఆయా శాఖలకు కేంద్రం సూచించినట్టు ‘ఎకమిక్ టైవ్ వివరించింది.
మానిటైజేషన్ లక్ష్యాలను చేరుకోని శాఖలకు వచ్చే బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధించనున్నట్టు కేంద్రం హెచ్చరించినట్టు కూడా తెలుస్తున్నది. ఏడు నెలలు పూర్తయినప్పటికీ, ఈ ఏడాది మానిటైజేషన్ లక్ష్యాన్ని 20 శాతం కూడా చేరుకోకపోవడంపై కేంద్రం ఆయా శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్ఎంపీ ద్వారా ఈ ఏడాది ఆస్తులను విక్రయించి రూ.1.24 లక్షల కోట్లను ఆర్జించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొన్నట్టు సమాచారం. అంటే రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.1.24 లక్షల కోట్లకే విక్రయించాలని కేంద్రం భావిస్తున్నట్టు అర్థమవుతున్నది. కాగా, రైల్వే, టెలికం శాఖలు మానిటైజేషన్ ప్రక్రియను వచ్చే ఏడాది వరకు వాయిదా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం.