న్యూఢిల్లీ, మే 26: బియ్యం ఎగుమతులపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే గోధుమల ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశీయ అవసరాలకు కూడా గోధుమలు తక్కువ పడొచ్చన్న అంచనాల నేపథ్యంలో బియ్యం ఎగుమతుల్లో కేంద్రం కోత విధించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో రేషన్ ద్వారా బియ్యం, గోధుమలను పంపిణీ చేస్తున్నారు.
గోధుమ కొరత కారణంగా వాటి స్థానంలో కొన్ని ప్రాంతాల్లో బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఇది కార్యరూపం దాలిస్తే ప్రభుత్వానికి మరిన్ని బియ్యం అవసరం. దీంతో డిమాండ్ పెరిగి బియ్యం రేటు పెరిగే ప్రమాదం ఉంది. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ఎగుమతులను తగ్గించవచ్చని భావిస్తున్నారు. అయితే, దేశంలో ఇప్పటికే బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, పీడీఎస్ కింద గోధుమల స్థానంలో కొంతకాలం పాటు బియ్యాన్ని పంపిణీ చేసినా పెద్ద ఇబ్బంది ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.