Owaisi on Kashmir | కశ్మీర్లోయలో వరుస హత్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. 1989 నాటి పొరపాట్లనే కేంద్రం పునరావృతం చేస్తున్నదని ఆరోపించారు. 1989లో జరిగిన పొరపాట్లనే మోదీ సర్కార్ చేస్తున్నది. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదని ఏఎన్ఐతో మాట్లాడుతూ అన్నారు. 1989లోనూ కశ్మీర్లోయలో రాజకీయ పార్టీలు, నాయకులపై నిషేధం విధించారని గుర్తు చేశారు. కశ్మీరీ పండింట్లను కేంద్రం మనుష్యులుగా చూడటం లేదని ఆరోపించారు. వారిని ఎన్నికల లబ్ధికి ఉపయోగించుకోవడానికే చూస్తున్నదని మండి పడ్డారు.
1987 కశ్మీర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిన ఫలితాన్ని 1989లో చవి చూశామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. స్థానిక నాయకులను మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం పుంజుకోవడానికి కారణమైందన్నారు. 1987లో భారీగా రిగ్గింగ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరుపై అసంతృప్తి, ఉద్రిక్తతలు పెరిగాయన్నారు. ఫలితంగా 1989 సెప్టెంబర్ నుంచి వరుస హత్యలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.