హైదరాబాద్, జనవరి 18 : అవకాశం వచ్చినప్పుడుల్లా తమను వ్యతిరేకించే రాష్ర్టాలపై అక్కసును వెల్లగక్కే కేంద్రంలోని బీజేపీ సర్కారు.. దేశ గణతంత్ర దినోత్సవాల్లోనూ వివక్షను ప్రదర్శించింది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వాల శాఖల తరఫున అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై శకటాలను ప్రదర్శించడం సంప్రదాయం. రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి మెరుగైన వాటిని ఎంపిక చేస్తారు. అయితే, ఈ సారి దాదాపు 15 రాష్ర్టాలకు చెందిన శకటాల ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వలేదు. తెలంగాణ, ఏపీ ఊసే ఎత్తలేదు. బెంగాల్, కేరళ, తమిళనాడు సహా పలు ఇతర రాష్ర్టాలకూ మొండిచేయి చూపింది. త్వరలో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో మణిపూర్ మినహా మిగిలిన రాష్ర్టాల శకటాలకు అనుమతి ఇచ్చింది. రాష్ర్టాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి కలిపి ఈసారి మొత్తం 56 ప్రతిపాదనలు రాగా, అందులో 21 నమూనాలను ఎంపిక చేసింది. అరుణాచల్ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు, విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయాన, సమాచార-తపాలా, హోం, జలశక్తి, సాంస్కృతిక మొదలైన 9 కేంద్ర ప్రభుత్వ శాఖలు శకటాలు అనుమతి పొందిన జాబితాలో ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక మినహా ఏ రాష్ర్టానికి చెందిన శకటాలకూ అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.
విమర్శల వెల్లువ..
గణతంత్ర వేడుకల్లో రాష్ర్టాల శకటాలను తిరస్కరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా ఆయన నెలకొల్పిన ఇండియన్ నేషనల్ ఆర్మీని గుర్తుచేస్తూ రూపొందించిన శకటాన్ని కేంద్రం తిరస్కరించింది. కేంద్రం నిర్ణయంతో బెంగాల్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సీఎం మమతాబెనర్జీ ప్రధానికి లేఖ రాశారు. శకట తిరస్కరణతో తమ రాష్ర్టాన్ని అవమానించారంటూ కేరళ నేతలు కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం కేంద్రానికి లేఖ రాశారు. శకటాల ఎంపిక వివాదంపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పందించారు. మార్గదర్శకాల ప్రకారమే ఎంపిక జరుగుతుందని స్టాలిన్, మమతకు లేఖ రాశారు.
ఈ సారి అరగంట ఆలస్యంగా..
కరోనా దృష్ట్యా రిపబ్లిక్ వేడుకలకు 5-8 వేల మందినే అనుమతించనున్నట్టు సమాచారం. దీంతోపాటు ఢిల్లీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పరేడ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. సాధారణంగా ఉదయం 10 గంటలకు జరగాల్సిన పరేడ్ ఈసారి 10.30కు ప్రారంభమవనున్నది. పరేడ్కు ముందు జరుగాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీ), పారాైగ్లెడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు ఎగురవేయడంపై నిషేధం విధించారు.