న్యూఢిల్లీ: ఐదు హైకోర్టులకు 13 మంది కొత్త జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు నలుగురు న్యాయవాదులను, కేరళ హైకోర్టుకు ముగ్గురిని, ఛత్తీస్గఢ్ హైకోర్టుకు ఒక న్యాయవాదిని జడ్జిగా సిఫారసు చేయగా, కలకత్తా హైకోర్టుకు ముగ్గురు జుడీషియల్ అధికారులకు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని పేర్కొన్నది. ఏపీ హైకోర్టు జడ్జీలుగా సీనియర్ న్యాయవాది డాక్టర్ కే మన్మథరావు, జుడీషియల్ అధికారిణి బీఎస్ భానుమతిలకు పదోన్నతి కల్పించాలని సిఫారసు చేసింది. ఇదిలా ఉండగా, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీని మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్రన్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ హైకోర్టుకు ‘గే’ జడ్జి!
స్వలింగ సంపర్కుడైన (గే) న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టుకు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫా రసు చేసింది. ఒకవేళ ఈ సిఫా రసును కేంద్రం ఆమోదిస్తే, భారత్ లో తొలి గే జడ్జిగా సౌరభ్ రికార్డులకెక్కనున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సౌరభ్ పేరును ఇప్పటికి నాలుగుసార్లు ప్రతిపాదించారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సౌరభ్ గెలిచారు.