న్యూఢిల్లీ, మే 8: వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) ప్రొవైడర్లు తమ వినియోగదారుల సమాచారాన్ని కనీసం ఐదేండ్ల పాటు కచ్చితంగా నిల్వ చేసి పెట్టాలన్న కేంద్రం తాజా నిబంధన వీపీఎన్ ప్రొవైడర్లు, వినియోగదారులతో పాటు ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిని వీపీఎన్ కంపెనీలతో పాటు టెక్ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన తాజా నిబంధన వినియోగదారుల గోప్యతకు భంగం కలిగిస్తుందని వాదిస్తున్నారు.
వీపీఎన్ ప్రొవైడర్లు తమ వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేయడం మొదలు పెడితే ఇక వీపీఎన్ అన్నదానికి అర్థం ఏముందని ప్రశ్నిస్తున్నారు. వీపీఎన్ల అసలు ఉద్దేశమే దెబ్బతింటున్నదని పేర్కొంటున్నారు. వ్యక్తిగత గోప్యతను కోరుకొనేవారే వీపీఎన్ను కొనుగోలు చేస్తారన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ రూల్ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులు, వ్యతిరేకులను టార్గెట్ చేయడానికే కేంద్రం ఈ రూల్స్ తెచ్చిందని ఆరోపిస్తున్నారు. టెక్ఫాగ్ ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.
వీపీఎన్ అంటే ఏమిటి.. ఎలా పనిచేస్తుంది?
ఇదొక ప్రైవేట్ ఇంటర్నెట్ వ్యవస్థ. సాధారణంగా ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్న కంప్యూటర్లు అన్నింటికి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్తో కంప్యూటర్ లొకేషన్ తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఏం చేస్తున్నారో కనుక్కోవచ్చు. అయితే, వీపీఎన్ను తీసుకొని ఆ వ్యవస్థ ద్వారా పనిచేసినప్పుడు ఇంటర్నెట్లోనే మరో నెట్వర్క్ ఓపెన్ అవుతుంది. వినియోగదారుల ఐపీ అడ్రస్ కనిపించదు. వీపీఎన్ ప్రొవైడర్లు తాత్కాలిక ఐపీలను కేటాయిస్తాయి. సర్వర్ నుంచి ఇవి వీపీఎన్ ద్వారా వినియోగదారులకు చేరతాయి. దీనిని గుర్తించడం కష్టం.
కేంద్రం ఆదేశాలేంటి?
అన్ని డాటా సెంటర్లు, వీపీఎన్ ప్రొవైడర్లు, క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్లు, వర్చువల్ ప్రైవేట్ సర్వర్(వీపీఎస్) తమ వినియోగదారుల పేర్లు, వారికి అందించే సర్వీసు కాల వ్యవధి, ఐపీ అడ్రస్లు, ఈమెయిల్ అడ్రస్లు కనీసం ఐదేండ్ల పాటు తమ దగ్గర నిల్వ చేసి పెట్టుకోవాలి. కస్టమర్లు ఎందుకు వీపీఎన్ను ఎంచుకొన్నారో కూడా వివరాలు సేకరించాలి. వారి అడ్రస్, కాంటాక్టు నంబర్ తీసుకోవాలి. కస్టమర్లు ఒకవేళ తమ వీపీఎన్ సర్వీసును రద్దు చేసుకొన్నా కూడా వారి వివరాలను ఐదేండ్ల దాకా తొలగించవద్దు. కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏప్రిల్ 26న ఈ ఆదేశాలను జారీ చేసింది. సంఘ విద్రోహ శక్తులను, సైబర్ క్రిమినల్స్ను పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అందులో పేర్కొన్నది. నేరాలను నిరోధించవచ్చని అభిప్రాయపడింది.
వీపీఎన్ ప్రొవైడర్ల అభ్యంతరాలేంటి?
వీపీఎన్ ప్రొవైడర్లు సాధారణంగా వినియోగదారుల నుంచి ఎక్కువగా సమాచారాన్ని సేకరించవు. అంతే కాకుండా పెద్ద పెద్ద వీపీఎన్ కంపెనీల్లో సర్వీసు లావాదేవీలు కూడా బిట్ కాయిన్ల రూపంలోనే జరుగుతాయి. దీనికి తోడు చాలా కంపెనీల్లో ఇన్బిల్ట్ యాప్లు వీపీఎన్ కస్టమర్లకు అనుగుణంగా ఉంటాయి. వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తాయి. కేంద్రం తాజా నిబంధనతో దీన్ని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, గోప్యతను కోరుకొనేవారే వీపీఎన్లను ఆశ్రయిస్తారు. ఇప్పుడు వారి వివరాలు స్టోర్ చేస్తారని తెలిస్తే వీపీఎన్లను ఎవరూ కొనరు. ఫలితంగా కంపెనీలు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ‘మేం వినియోగదారులకు సంబంధించి కొంత సమాచారాన్ని మాత్రమే సేకరిస్తాం. వారి గోప్యతను గౌరవిస్తాం. కేంద్రం కొత్త ఆదేశాలను పరిశీలిస్తున్నాం. ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే, రష్యాలోలాగే ఇండియాలోనూ మా సేవలను నిలిపివేస్తాం’ అని ప్రముఖ వీపీఎన్ ప్రొవైడర్ ‘నార్డ్వీపీఎన్’ పేర్కొంది.
కేంద్రం వర్సెస్ నెటిజన్లు
‘ఎవరైనా ముసుగు తొడుక్కొని వచ్చి దాడికి ప్రయత్నిస్తే.. మీరు ఆ ముసుగును తొలగించడానికి ప్రయత్నిస్తారా లేదా.. ఇదీ అలాంటిదే’ –అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఐటీ మంత్రి.
‘అంటే, కేంద్రంపై విమర్శలు చేసే వారి గురించి తెలుసుకొని, వేధించాలన్నదే మీ లక్ష్యమని ఇన్డైరెక్టుగా ఒప్పుకుంటున్నారా? వైష్ణవ్జీ..’
–ట్విట్టర్లో ఓ వీపీఎన్ యూజర్