న్యూఢిల్లీ, నవంబర్ 24: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్వో) గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న రూ.15000 గరిష్ఠ వేతనాన్ని రూ.21,000కు పెంచాలని యోచిస్తున్నట్టు ఈపీఎఫ్వో వర్గాలు తెలిపాయి. గరిష్ఠ వేతనాన్ని 2014లో చివరిసారి పెంచారు. రూ.6,500 ఉన్న వేతనాన్ని రూ.15,000 చేశారు. ఈపీఎఫ్వో గరిష్ఠ వేతనం పెరిగితే ఉద్యోగి, యాజమాన్యాలు చెల్లించే నెలవారీ చందా కూడా ఆ మేరకు పెరుగుతుంది.
దీంతో ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పెన్షన్ అధికంగా లభిస్తుంది. గరిష్ఠ వేతనం పెంపుపై త్వరలోనే ఓ నిపుణుల కమిటీ వేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ కమిటీ గరిష్ఠ వేతనాన్ని ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందని వెల్లడించాయి. ప్రస్తుతం ఈపీఎఫ్వోలో 6.8 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. గరిష్ఠ వేతనం పెంచితే మరో 75 లక్షల మంది చేరుతారని భావిస్తున్నారు. 20 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని ఈపీఎఫ్వో వర్గాలు తెలిపాయి.