న్యూఢిల్లీ, మే 18: రాష్ర్టాలకు, పవర్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేస్తామని, ఆ బాధ్యత తమదేనని పేర్కొన్న కేంద్రం.. 20 రోజులు కాకుండానే మాటమార్చింది. దేశంలో బొగ్గు సంక్షోభాన్ని తగ్గించడానికి అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలకు (జెన్కోలకు) ఆదేశాలివ్వాలని తాజాగా పేర్కొంది. నిర్ణీత గడువులోగా దిగుమతి ఆర్డర్లు ఇవ్వని జెన్కోలపై చర్యలు తీసుకొంటామని బెదిరింపులకు దిగింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కేసింగ్ అన్ని రాష్ర్టాలకు బుధవారం ఓ లేఖ రాశారు. ‘ఈ నెల 31లోపు జెన్కోలు విదేశీ బొగ్గుకు ఆర్డర్లు ఇవ్వాలి. జూన్ 15 నాటికి పవర్ ప్లాంట్లలోకి ఆర్డర్ చేసిన బొగ్గు రావాలి. బ్లెండింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాలి. ఒకవేళ, ఇది జరుగని పక్షంలో.. ఆదేశాలు పాటించని ప్లాంట్లో విదేశీ బొగ్గు దిగుమతులను 15 శాతానికి పెంచుతాం. అప్పుడు జెన్కోలు ప్లాంట్ సామర్థ్యంలోని మొత్తం బొగ్గులో 15 శాతం బొగ్గుని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 85 శాతం బొగ్గును మాత్రమే కోల్ ఇండియా సరఫరా చేస్తుంది. అక్టోబర్ 31 వరకూ ఇదే ప్రక్రియ కొనసాగుతుంది’ అని కేంద్ర విద్యుత్తు శాఖ అన్ని రాష్ర్టాలు, ప్రభుత్వ, ప్రైవేట్, ఇండిపెండెంట్, పవర్ప్లాంట్లకు ఆదేశాలు జారీ చేసింది.
నిర్వాకం కేంద్రానిదే..
దేశంలో బొగ్గు లభ్యతలో ఇబ్బందులు లేవని నెలరోజుల క్రితం వరకూ కేంద్రం గొప్పలు చెప్పుకొన్నది. అయితే, వేసవిలో విద్యుత్తు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, గత అక్టోబర్లో బొగ్గు సంక్షోభం ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో.. బొగ్గు లభ్యత, విద్యుత్తు ఉత్పత్తి విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ, ముందుచూపు లేని తమ విధానాలు ఎక్కడ బయటపడుతాయేమోనని సంక్షోభాన్ని కప్పిపుచ్చడానికి కేంద్రం ప్రయత్నిస్తూ వచ్చింది. తీరా బొగ్గు నిల్వలు అడుగంటిపోవడం, విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడటంతో ఒకటి రెండు మినహా మిగతా అన్ని రాష్ర్టాల్లో అంధకారం అలుముకొన్నది. దీంతో కేంద్రం కొత్త వ్యూహానికి తెరతీసింది. బ్లెండింగ్ ప్రాసెస్ను (విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గును స్థానికంగా ఉత్పత్తి చేసిన బొగ్గుతో మిక్స్ చేసి ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయడం) కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి 10 శాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలన్నది. నిర్ణీత గడువును మీరి ఉల్లంఘనలకు పాల్పడిన ప్లాంట్లు 15 శాతం బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
నాడు అలా..
బొగ్గు, విద్యుత్తు సంక్షోభంపై భయపడాల్సిన అవసరమే లేదు. దేశంలోని థర్మల్ ప్లాంట్ల దగ్గర సరిపడినన్ని నిల్వలు ఉన్నాయ్. నిరంతర ఉత్పత్తి కూడా జరుగుతున్నది. నిల్వలపై కేంద్రం గంటగంటకూ సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నది. రాష్ర్టాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేసేందుకు మేమున్నాంగా.. భయమెందుకు?
–ఏప్రిల్ 27న బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
నేడు ఇలా..
బొగ్గు కొరతను అధిగమించడానికి విద్యుత్తు ప్లాంట్లు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలి. ఇందుకోసం ఎక్కువ ధరైనా చెల్లించాలి. ఈ నెల 31 నాటికి బొగ్గు దిగుమతులకు ప్లాంట్లు ఆర్డర్లు ఇవ్వాలి. వచ్చే నెల 15 నాటికి ప్లాంట్లలోకి బొగ్గు సరఫరా జరుగాలి. బ్లెండింగ్ ప్రాసెస్ మొదలవ్వాలి. లేకపోతే ఆంక్షలే. బొగ్గు పర్యవేక్షణ బాధ్యత రాష్ర్టాలు చూసుకోవాలి.
–మే 18న కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కేసింగ్
సమన్వయం లేకనే..
విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకొంటే రాష్ర్టాలపై అదనపు భారం పడుతుంది. ఆ భారాన్ని సంక్షోభానికి కారణమైన కేంద్రమే భరించాలి. విద్యుత్తు, బొగ్గు, రైల్వే శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే దేశంలో బొగ్గు సంక్షోభం ఏర్పడింది. బ్లెండింగ్ ప్రాసెస్ మోతాదు పెరిగితే బాయిలర్లలో ట్యూబ్ లీకేజీ సమస్యలు తలెత్తవచ్చు.
–ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్
రాష్ర్టాలపై కేంద్రం ఒత్తిళ్లు
విదేశాల నుంచి అధిక ధరకు బొగ్గు దిగుమతులు చేసుకోవాలంటూ రాష్ర్టాలపై కేంద్రం ఒత్తిళ్లకు పాల్పడుతున్నది. దేశీయంగా లభించే బొగ్గుతో పోలిస్తే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గు ధర మూడు రెట్లు ఉంటుంది.
–రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్