న్యూఢిల్లీ, మార్చి 5: మోసపూరిత ఫోన్ కాల్స్, టెక్స్ మెసేజ్ల ద్వారా మోసపోయిన బాధితులు దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వదిలేస్తుంటారు. అలాంటి వారికి కేంద్రం ఒక వేదిక కల్పిస్తూ సోమవారం రెండు డిజిటల్ ప్లాట్ఫాంలను ప్రారంభించింది. ఇలాంటి బాధితులు సంచార్ సౌధీ పోర్టల్లోని చక్షు, డీఐపీ ద్వారా తమ ఫిర్యాదులను నమోదుచేయవచ్చు. ఈ రెండు పోర్టల్స్ ద్వారా మోసపూరిత కార్యక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
మోసపూరితమైన కాల్స్, లేదా ఎస్ఎంఎస్లు, వాట్సాప్లు, ఇతర సామాజిక మాధ్యమాల్లో టెక్స్ రూపంలో వచ్చినా, దాని ద్వారా మోసపోయిన పౌరులు చక్షులో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. దీంతో నిర్వాహకులు వాటిని పునః పరిశీలన చేస్తారు. ఒక వేళ పునః పరిశీలనలో విఫలమైతే ఆ నెంబర్ను డిస్కనెక్ట్ చేస్తారు. ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయని, సంస్థలు, వ్యక్తులను టార్గెట్గా చేసుకుని ఈ నేరగాళ్లు వివిధ కాల్స్, మెసేజ్ల ద్వారా ప్రజలను మభ్యపెట్టడం, లేదా భయపెట్టడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు.