న్యూఢిల్లీ : వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం గురువారం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు అత్యధికంగా వెలుగుచూస్తున్న క్రమంలో ప్రజలకు అంబులెన్స్లు, ఆస్పత్రుల్లో పడకల నమోదు వంటి సేవలను అందించేలా జిల్లా స్ధాయి, సబ్ డిస్ట్రిక్ట్ స్ధాయిలో కంట్రోల్ రూంలను తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కంట్రోల్ రూంల్లో తగినన్ని ఫోన్ లైన్స్ను ఏర్పాటు చేయడంతో పాటు డాక్టర్లు, కౌన్సెలర్లు, వాలంటీర్లను అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కంట్రోల్ రూంల్లో కొవిడ్-19 పరీక్షా కేంద్రాలు, అంబులెన్స్ల లభ్యతతో పాటు పలు వైద్య సేవలకు సంబంధించి రియల్ టైం డేటాను నిర్వహించాలని సూచించింది.
ఇక గడిచిన 24 గంటల్లో 495 ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో తాజా వేరియంట్ కేసుల సంఖ్య 2630కి ఎగబాకింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో నూతన వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 90,928 కొవిడ్-19 కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి ఒక్కరోజులోనే 325 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్తో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 4,82,876కి పెరిగింది.