న్యూఢిల్లీ, మే 11: లాభాల్లో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులను(అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గువాహటి, తిరువనంతపురం) లీజు పేరుతో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అప్పగించడంలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆయా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఆరోపించారు. టెండర్ ప్రక్రియపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఎయిర్పోర్టుల లీజుపై అధికారిక వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరారు. కేంద్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అదానీ ఎంటర్ప్రైజెస్కు అనుకూలంగా టెండర్ నిబంధనలను మార్చిందని ఆరోపించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ యూనియన్(ఏయూఈ) నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ధర్నాల్లో ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.
ఏఏఐ చట్టం ఉల్లంఘనే
అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గువాహటి, తిరువనంతపురం ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతలను అదానీ గ్రూప్నకు కేంద్రప్రభుత్వం ఇటీవలే అప్పజెప్పింది. మొత్తంగా 50 ఏండ్లకు లీజుకు ఇచ్చింది. ఇది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-1994 చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఏయూఈ ఆరోపించింది. ఈ చట్టం ప్రకారం ఏ ఎయిర్పోర్టును కూడా ప్రైవేటు వ్యక్తులకు 30 ఏండ్లకు మించి లీజుకు ఇవ్వరాదని పేర్కొన్నది. కేంద్రం చర్య ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)పై దుష్ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆరు ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతను తీసుకొనేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ కోట్ చేసిన మొత్తం పైన కూడా ఏయూఈ అనుమానం వ్యక్తం చేసింది.