న్యూఢిల్లీ : దివంగత లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత నైటింగేల్కు పోస్టల్ స్టాంప్ జారీ సముచిత గౌరవంగా నిలుస్తుందని ఓ వార్తా చానెల్తో మాట్లాడుతూ కేంద్ర రైల్వేలు, ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. లతా మంగేష్కర్ సంస్మరణ స్టాంప్గా పోస్టల్ స్టాంప్ను జారీ చేస్తామని ఆయన చెప్పారు.
జాతీయ, అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, వ్యవసాయం, పర్యావరణం, వాణిజ్యం, కళలు వంటి భిన్న రంగాల్లో అద్భుత నైపుణ్యాలతో ప్రజల మన్ననలు పొందిన వారి పేరిట ఆయా వ్యక్తుల గౌరవార్ధం పోస్టల్ స్టాంప్లు జారీ చేస్తారు. ఈ స్టాంప్లను పరిమిత సంఖ్యలో ముద్రిస్తారు. ఏటా జారీ చేసే స్టాంపుల్లో ఈ తరహా స్టాంపులు పది శాతం మించరాదు. ఇక ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ ఈనెల 6న ఆదివారం ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
కొవిడ్-19 నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్యాలు వెంటాడటంతో వేలాదిమంది అభిమానులను శోకసంద్రంలో ముంచి ఆమె మరలిరాని లోకాలకు తరలివెళ్లారు. ముంబైలోని దాదర్ శివాజీ పార్క్లో ఆదివారం సాయంత్రం లతా మంగేష్కర్ భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరుకాగా వేలాది మంది అభిమానులు లెజెండరీ గాయనికి తుది వీడ్కోలు పలికారు.