న్యూఢిల్లీ : మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్కు చెందిన దగ్గు సిరప్ల కారణంగా గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం కేంద్రం నలుగురు సభ్యులతో నిపుణల కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కేంద్ర, హర్యానా రాష్ట్ర డ్రగ్స్ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా లోపాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో దగ్గు సిరప్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన నివేదికపై దర్యాప్తు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీకి స్టాండింగ్ కమిటీ ఆన్ మెడిసిన్స్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ వైకే గుప్తా, పుణే ఐసీఎంఆర్-ఎన్ఐవీ డాక్టర్ ప్రజ్ఞా యాదవ్, ఢిల్లీకి చెందిన ఎన్సీడీసీ ఎపిడెమియాలజీ విభాగం డాక్టర్ ఆర్తి బహ్ల్, సీడీఎస్ఈఓకు చెందిన అధికారి ఏకే ప్రధాన్తో కమిటీ ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.