జాబుల్లో మాజీ సైనికోద్యోగ కోటా మొత్తం ఖాళీ
అన్ని ప్రభుత్వ విభాగాల్లో రెండు శాతం లోపే భర్తీ
నైపుణ్యాలు లేవంటూ తిరస్కరిస్తున్న సంస్థలు
తాజాగా అగ్నివీర్కు మరో 10 శాతం కోటా
ఎలా భర్తీ చేస్తారంటూ నిరుద్యోగుల ఆగ్రహం
న్యూఢిల్లీ, జూన్ 20: అగ్నివీరులకు సైన్యం నుంచి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాజీ సైనికోద్యోగులకు కేంద్రప్రభుత్వ పరిధిలోని అన్ని సంస్థల్లో రిజర్వేషన్ ఉన్నది. కానీ ఏ ఒక్క సంస్థలోనూ ఆ క్యాటగిరీ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదని ఆంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ పరిశోధనలో తేలింది. అవసరమైన నైపుణ్యాలు లేనందునే మాజీ సైనికులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదని రక్షణశాఖ నిర్వహించిన పలు సమావేశాల్లో అధికారులు తెలిపారు. దీంతో ఉన్న కోటానే భర్తీచేయలేకపోతున్న ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన కోటాను ఎలా భర్తీ చేస్తుందని నిరుద్యోగులు నిలదీస్తున్నారు.
ఇవీ వాస్తవాలు
* సైన్యంలో ప్రవేశాలకోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తటంతో కేంద్ర ప్రభుత్వం అగ్నివీరులకు రిటైర్మెంట్ తర్వాత వేరే ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది.
* కేంద్రప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో ప్రవేశాల్లో మాజీ సైనికోద్యోగులకు ఇప్పటికే రిజర్వేషన్ ఉన్నది. కానీ ఏ సంస్థ కూడా ఆ రిజర్వేషన్ను ఒకశాతానికి మించి నింపలేదని తేటతెల్లమైంది.
* రక్షణ శాఖ పరిధిలోని మాజీ సైనికోద్యోగుల సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ (ప్రవేశాలు)కు చెందిన నివేదికలను ఇండియన్ ఎక్స్ప్రెస్ పరిశోధించింది. 2021 జూన్ 20 నాటికి అందుబాటులో ఉన్న డాటాను పరిశీలించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి.
* కేంద్రం మాజీ సైనికులకు సీ క్యాటగిరీ పోస్టుల్లో 10 శాతం, డీ క్యాటగిరీ పోస్టుల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించింది. పారా మిలిటరీ దళాల్లో (సీఏపీఎఫ్) కూడా 10 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. అయితే, ప్రస్తుత డాటా ప్రకారం సీ క్యాటగిరీ పోస్టుల్లో 1.29 శాతం, డీ పోస్టుల్లో 2.66 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. మిగతా పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి.
* సీఏపీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి పోస్టుల వరకు మాజీ సైనికులకు రిజర్వేషన్ ఉన్నది. కానీ, ఆ దళాల్లోని ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో సీ క్యాటగిరీలో 0.47 శాతం, బీ పోస్టుల్లో .87 శాతం, గ్రూప్ ఏ పోస్టుల్లో 2.20 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి.
* ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూ) కూడా పరిస్థితి అలాగే ఉన్నది. ఎక్స్సర్వీస్మెన్కు ఈ సంస్థల్లోని గ్రూప్ సీ పోస్టుల్లో 14.5 శాతం, గ్రూప్ డీ క్యాటగిరీలో 24.5 శాతం రిజర్వేషన్ ఉన్నది. కానీ ఇప్పటివరకు గ్రూప్ సీలో 1.15 శాతం, గ్రూప్ డీలో 0.3 శాతం పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. మొత్తం 170 పీఎస్యూలకుగాను 94 సంస్థల్లో మాత్రమే ఎక్స్సర్వీస్మెన్ కోటా వివరాలు అందుబాటులో ఉండటం మరీ దారుణం.
* మాజీ సైనికుల రిజర్వేషన్ పోస్టులను నింపటంలో ప్రభుత్వరంగ బ్యాంకులు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఈ సంస్థల్లోని గ్రూప్ సీ పోస్టుల్లో 14.5, గ్రూప్ డీలోని 24.5 శాతం పోస్టులు మాజీ సైనికులకు కేటాయించారు. తాజా డాటా ప్రకారం గ్రూప్ సీలో 9.10 శాతం, గ్రూప్ డీలో 21.34 శాతం కోటా పోస్టులను భర్తీ చేశారు.
* మాజీ సైనికుల కోటా పోస్టులను పూర్తిగా భర్తీచేయటంపై రక్షణ శాఖ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ఈ నెల 2న కూడా అన్ని శాఖల్లోని ఎక్స్సర్వీస్మెన్ కోటా భర్తీ బాధ్యులతో సమావేశమైంది. ఈ సమావేశంలో అధికారులంతా ‘మా సంస్థల్లోని ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలున్న మాజీ సైనికులు దొరకటం లేదు’ అన్న ఒకే మాట చెప్పారని సమాచారం.
మొత్తం 170 పీఎస్యూలకుగాను 94 సంస్థల్లో మాత్రమే ఎక్స్సర్వీస్మెన్ కోటా వివరాలు అందుబాటులో ఉన్నాయి
కేంద్రప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాలను ఏ, బీ, సీ, డీ అని నాలుగు క్యాటగిరీలుగా విభజించారు. ఏ క్యాటగిరీవి పరిపాలనా సంబంధమైన ఉద్యోగాలు కాగా బీ క్యాటగిరీ పోస్టులు ఆ తర్వాతి మధ్య స్థాయి ఉద్యోగాలు. సీ క్యాటగిరీల్లో క్లరికల్, డీ క్యాటగిరీలో మెయింటనెన్స్, లేబర్ పోస్టులు ఉంటాయి.