న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల (Parliament Special Session) నిర్వహణకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న అఖిలపక్ష భేటీ (All Party Meet ) ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ఈ విషయం తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. ‘ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో 17వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు అఖిలపక్ష ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేశాం. ఇందుకు సంబంధించిన ఆహ్వానాలను సంబంధిత నేతలకు ఈ మెయిల్ ద్వారా పంపాం. లేఖలు కూడా వారికి చేరుతాయి’ అని ఎక్స్లో పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలతోపాటు అఖిలపక్ష సమావేశం అజెండా ఏమిటన్నది ఆయన స్పష్టం చేయలేదు.
కాగా, సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగస్ట్ 31న ప్రకటించారు. అయితే ప్రత్యేక సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నారో అన్నది వెల్లడించలేదు. మరోవైపు ఇండియా పేరును ‘భారత్’గా మార్పు చేయడం, ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ కోసం కేంద్ర ప్రభుత్వం తీర్మానాలు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.