న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.986 కోట్లతో పెగాసస్ మాదిరి ‘కాగ్నైట్’ (Cognyte) స్పైవేర్ను కొనేందుకు ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష నేతలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలపై నిఘా పెట్టేందుకు ఈ గూఢచర్య సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మీడియాతో సోమవారం మాట్లాడారు. పెగాసస్ స్పైవేర్ గురించి అందరికీ తెలిసిపోవడంతో ‘కనీస పాలన-గరిష్ట నిఘా’ ఉన్న ప్రభుత్వం మార్కెట్లో ఉన్న కొత్త స్పైవేర్ ‘కాగ్నైట్’ కోసం చూస్తున్నదని విమర్శించారు. ‘ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలను మాత్రమే ద్వేషిస్తుందని నేను భావించాను. అయితే తమ మంత్రులపై కూడా గూఢచర్యం సాఫ్ట్వేర్ను వారు ఉపయోగించారు’ అని ఖేరా ఆరోపించారు.
కాగా, దేశంలోని ఇద్దరు గూఢచారులు చట్టాన్ని, మీడియాతో సహా ఎవరినీ నమ్మరని పవన్ ఖేరా విమర్శించారు. అందుకే స్పై సాఫ్ట్వేర్, ఇజ్రాయెల్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు పన్ను చెల్లింపుదారుల కోట్లాది డబ్బును ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తన అబద్ధాల రాజభవనం కూలిపోతుందని చక్రవర్తి భయపడుతున్నారంటూ పరోక్షంగా ప్రధాని మోదీని దుయ్యబట్టారు. అందుకే ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, పౌరులతోపాటు సొంత మంత్రులపై కూడా గూఢచర్యం చేయడానికి ప్రభుత్వం కొత్త సాంకేతికతను ఉపయోగిస్తుందని ఆరోపించారు. అలాగే ‘కాగ్నైట్’ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేయడానికి ఏ మంత్రిత్వ శాఖకు టాస్క్ ఇచ్చారు? దాని కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
Also Read: