లక్నో: రెండేళ్ల పాప అదృశ్యమైంది. రెండు రోజుల తర్వాత పొరుగింట్లో ఆ చిన్నారి మృతదేహం లభించింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ దారుణ సంఘటన (Greater Noida Shocker) జరిగింది. శివకుమార్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి సూరజ్పూర్ ప్రాంతం దేవ్లా గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శుక్రవారం పని చేసేందుకు స్థానిక ఫ్యాక్టరీకి వెళ్లాడు. అనంతరం అతడి భార్య కూడా స్థానిక మార్కెట్కు వెళ్లింది. రెండేళ్ల పాప, ఏడు నెలల బాబు ఇంట్లో ఉన్నారు. ఆమె తిరిగి ఇంటికి రాగా రెండేళ్ల పాప కనిపించలేదు. దీంతో ఇరుగుపొరుగు వారిని ఆమె అడిగింది. ఆ ప్రాంతం అంతా వెతికింది. పాప కనిపించకపోవడంతో తండ్రి శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఆదివారం మధ్యాహ్నం పొరుగింటి నుంచి దుర్వాసన రావడాన్ని శివకుమార్ కుటుంబం గ్రహించింది. ఆ ఇంటి డోర్ లాక్ చేసి ఉండటంతో పోలీసులకు ఈ విషయం చెప్పారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. ఒక తలుపునకు వేలాడుతున్న బ్యాగ్లో పాప మృతదేహం కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు పాప మృతదేహం లభించిన పొరుగున ఉన్న ఇంట్లో రాఘవేంద్ర అనే వ్యక్తి ఉంటున్నాడు. పాప కనిపించకపోవడంతో వెతికేందుకు ఆ చిన్నారి తల్లిదండ్రులకు అతడు సహకరించాడు. అనంతరం కనిపించకుండా పోయాడు. దీంతో రాఘవేంద్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసేందుకు అతడి కోసం వెతుకుతున్నారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: