న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘ సుప్రీంకోర్టులో ఈ అంశంపై వాదనలు కొనసాగుతున్నందున పది రోజుల్లోగా మీ అభిప్రాయం చెప్పండి’ అని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖల్లో కోరింది. స్థానిక ఆచారాలు, విలువలను దృష్టిలో పెట్టుకొని అభిప్రాయాలను వెల్లడించాలని సూచించింది.
మరోవైపు స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ర్టాలను కూడా ఈ అంశంలో ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. కాగా, బుధవారం విచారణ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. స్కలింగ వివాహాల చట్టబద్ధతను పట్ణణాల్లోని సంపన్నులు మాత్రమే కోరుకుంటున్నారని చెప్పేందుకు కేంద్రం వద్ద ఎలాంటి డాటా లేదు, దీనిని అలా చూడలేమని అన్నారు. ‘చట్టబద్ధత కోరుకుంటున్నవారిలో అత్యధికులు పట్టణాల నుంచి వచ్చి వుండవచ్చు. కానీ అలా అని చెప్పేందుకు ప్రభుత్వం వద్ద కచ్చితమైన డాటా లేదు’ అని సీజేఐ వాఖ్యానించారు.