ముంబై: క్వారంటైన్ మార్గదర్శలకాలను సవరించాలని మహారాష్ట్రను కేంద్ర ప్రభుత్వం కోరింది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్పై భయాందోళనల నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలను మార్పు చేయాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మార్గదర్శకాలను ఏకరీతిగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఒక లేఖలో పిలుపునిచ్చారు.
ఒమిక్రాన్ వేరియంట్పై అలజడి నేపథ్యంలో నవంబర్ 30న మహారాష్ట్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంతో సంబంధం లేకుండా ముంబై విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ వచ్చిన అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొంది.
అలాగే, ముంబైలో దిగిన తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్లలో వెళ్లే ప్రయాణికుల తదుపరి జర్నీ తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్పై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు ప్రయాణించే దేశీయ ప్రయాణీకులు, ప్రయాణ తేదీకి 48 గంటల ముందు నాటి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్ట్ అవసరమని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలు జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో వీటిని సవరించాలని ఆ రాష్ట్రానికి సూచించింది.
కాగా, పూర్తిగా టీకాలు తీసుకున్న దేశీయ ప్రయాణీకులు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్ లేకుండా మహారాష్ట్రకు ప్రయాణించవచ్చని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే బుధవారం తెలిపారు. అయితే, 10-15 రోజుల ప్రయాణ చరిత్రలో ఒమిక్రాన్ ప్రభావిత ప్రాంతాలు ఉంటే, ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని చెప్పారు. అనంతరం ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రయాణాలకు వారిని అనుమతిస్తామన్నారు.