న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించింది. కరువుభత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం (28 శాతం నుంచి 31 శాతానికి) పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల 47.14 లక్షల మంది ఉద్యోగులకు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని, ఖజానాపై రూ.9,488 కోట్ల వార్షిక భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది జనవరి 1, జూలై 1, ఈ ఏడాది జనవరిలో మూడు అదనపు ఇన్స్టాల్మెంట్లను నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది జూలైలో మళ్లీ డీఏ, డీఆర్ను పునరుద్ధరించి 17 శాతం నుంచి 28 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్కు ఆమోదం
దేశంలో మల్టీ మోడల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, దాని అమలు, పర్యవేక్షణ, సహాయక వ్యవస్థకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. మౌలిక వసతుల అభివృద్ధితో రవాణా (లాజిస్టిక్) ఖర్చులను తగ్గించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం ప్రధాని మోదీ ఈ నెల 13న రూ.100 లక్షల కోట్ల నేషనల్ మాస్టర్ ప్లాన్ను ప్రారంభించారు. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు రవాణా ఖర్చులను, సమయాన్ని తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి నేతృత్వంలో 18 మంత్రిత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా సాధికార గ్రూపును ఏర్పాటు చేయనున్నారు.