న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్వోఎస్ అధికారులు విదేశాల్లో పొందే కానుకలను సొంతానికి ఉంచుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. భారత ప్రతినిధివర్గంలో భాగంగా విదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి అధికార ప్రముఖులు అందజేసే కానుకలను తమవద్దే ఉంచుకోవడాన్ని అనుమతిస్తూ 50 ఏళ్లనాటి నిబంధనను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా 1968 అఖిల భారత సర్వీసుల (ప్రవర్తన) నిబంధనావళి సెక్షన్ 11 కింద ఉప నిబంధనను చేర్చారు. ప్రతినిధివర్గంలో భాగంగా లేక ఇతరత్రా విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పెద్దలు అందజేసే కానుకలను విదేశీ కానుకల నిబంధనలకు లోబడి సొంతానికి ఉంచేసుకోవచ్చని ఈ ఉప నిబంధన తెలియజేస్తున్నది. దీనిపై ఇదివరకే రాష్ర్టాల నుంచి కేంద్రం అభిప్రాయ సేకరణ జరిపింది. పాత నిబంధనల ప్రకారం విదేశాల్లో అధికారులు అందుకునే కానుకలను విదేశాంగశాఖలోని తోషాఖానాకు అందజేయాలి. కానుకలు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఉండాలి. ఒక్కో కానుక విలువ రూ.25 వేలు మించితే ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా పరిపాలనా సర్వీసులకు చెందిన ఏ అధికారీ రూ.5 వేలకు మించిన కానుకను స్వీకరించరాదని 1968లో జారీచేసిన సర్వీసు నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీసు (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు (ఐఎఫ్వోఎస్) అధికారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. తమ అధికార వ్యవహారాలతో సంబంధమున్న వ్యక్తులు లేదా పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు లేక ఇతర సంస్థలు ఇచ్చే ఖరీదైన ఆతిథ్యం స్వీకరించరాదని కూడా నిబంధనలు సూచిస్తున్నాయి. కానుకల్లో ఉచిత రవాణా, వసతి లేదా మరే ఇతర ప్రత్యేక సౌకర్యం అనే అంశాలు కూడా ఉన్నాయి.