PM Modi | న్యూఢిల్లీ: దేశ పౌరులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు పరోక్షంగా నిఘా పెట్టిందని అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. అప్పట్లో పెను దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం గురించి తెలిసిందే. తాజాగా పౌరులందరిపైనా మోదీ సర్కారు కన్నేసి ఉంచినట్టు ఫైనాన్సియల్ టైమ్స్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. పౌరుల డాటా పర్యవేక్షణ వ్యవస్థలపై చట్టబద్ధమైన జోక్యం ద్వారా మోదీ సర్కార్ పౌరులపై నిఘా పెట్టిందని పేర్కొన్నది. ఇందుకు సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు, డాటా సెంటర్ల వద్ద నిఘా హార్డ్వేర్ను ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి చేస్తూ దేశంలోని టెలికం కంపెనీలకు ఆదేశాలు జారీచేయడాన్ని ప్రస్తావించింది.
దేశవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రతి రోజూ పౌరుల వ్యక్తిగత డాటా వెళ్తుంది. ఈ కేబుళ్లు నేటి డిజిటల్ యుగంలో భారత్కు, ప్రపంచానికి మధ్య గ్లోబల్ కమ్యూనికేషన్ను ఏర్పాటు చేస్తుంది. ప్రతి ల్యాండింగ్ స్టేషన్లలో ఒక హార్డ్వేర్ ఏర్పాటును కేంద్రం తప్పనిసరి చేసింది. కృత్తిమ మేధ, డాటా విశ్లేషణ ద్వారా సంబంధిత డాటాను సెర్చ్, కాపీ చేసి, అవసరమైన సమయంలో దేశ భద్రతా సంస్థలకు అందించేలా ఆదేశాలు జారీచేసింది. తద్వారా టెలికం సంస్థలు ప్రైవేటు సంస్థల నుంచి నిఘా పరికరాలను కొనుగోలు చేసేలా చేసింది. ఈ జాబితాలో దేశానికి చెందిన వెహెరే సంస్థతో పాటు ఇజ్రాయెల్కు చెందిన కాగ్నైట్, సెప్టియర్ వంటి సంస్థలు ఉన్నాయి. 2021లో అట్లాంటిక్ కౌన్సిల్ సెప్టియర్ను బాధ్యతారాహిత్య కంపెనీగా పేర్కొన్నది.
ఇజ్రాయెల్కు చెందిన సెప్టియర్ కంపెనీ రిలయన్స్ జియో, వొడాపొన్-ఐడియాలకు సాంకేతికతను అమ్మింది. ఈ నిఘాపై ప్రభుత్వంతో పాటు కాగ్నైట్, వెహెరే, జియో, సింగ్టెల్ను సంప్రదించగా.. స్పందించలేదని పేర్కొన్నది. ‘భారత ప్రభుత్వం నిర్దేశించిన లైసెన్సింగ్ షరతులు, నిబంధనలకు కట్టుబడి ఉంటాం’ అని వొడాఫోన్-ఐడియా పేర్కొన్నదని నివేదించింది.