న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఇటీవల ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు పౌరుల ప్రాణాలు తీశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిద్ధమైంది. ఇప్పుడున్న బలగాలకు అదనంగా మరో 18 కంపెనీల జవాన్లను కశ్మీర్కు పంపనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అంటే దాదాపు 1800 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అదనంగా కశ్మీర్కు వెళ్లనున్నారు. వీరిలో ఎక్కువ మందిని పూంచ్, రాజౌరి జిల్లాలకే కేటాయించనున్నారు. జమ్ము & కశ్మీర్ పరిసర ప్రాంతాలను 8 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను సాధ్యమైనంత త్వరలో పంపించనున్నారని, మరో 10 కంపెనీల జవాన్లను ఢిల్లీ నుంచి కశ్మీర్కు తరలించనున్నారని సమాచారం.
రాజౌరిలోని డాంగ్రి గ్రామంలో ఈ నెల 1న ఉగ్రవాదులు పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఆ మర్నాడే అదే జిల్లాలోని మరో గ్రామంలో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి చిన్నారి సహా ఇద్దరు మరణించారు. ఈ ఘటనల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ కశ్మీర్కు అదనపు బలగాలను పంపబోతున్నది.