రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తును బీజేపీ ప్రారంభించింది. ఆగస్టులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన పావులు కదపడం ప్రారంభించింది. ఈ పావులు బిహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి ప్రారంభించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ మధ్య బీజేపీ, నితీశ్ మధ్య సరైన సంబంధాలు లేవని ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను సీఎం నితీశ్ నుంచి ప్రారంభించడం ప్రాధాన్యం నెలకొంది.
రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బిహార్ సీఎం నితీశ్తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వీరిద్దరూ రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఎన్డీయే పక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవర్ని రంగంలోకి దింపాలి? ఏయే సమీకరణాలను తెరపైకి తేవాలి? అనుసరించాల్సిన వ్యూహం.. తదితర అంశాలను వీరిద్దరూ చర్చించారు.
అయితే.. సీఎం నితీశ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ.. మూడో వ్యక్తికి తెలియకుండానే జరిగింది. బిహార్ నేతలకు కూడా ఈ సమావేశంపై ఎలాంటి సమాచారమూ లేదట. ఓ వ్యూహం ప్రకారమే ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తమకు అనుకూలురైన పక్షాలతో బీజేపీ సంప్రదింపులు కొనసాగుతూనే వుంటాయని నేతలు అంటున్నారు.