Health Ministry | భారత్లో జరుగుతున్న వ్యాక్సినేషన్పై అంతర్జాతీయ మీడియా తప్పుడు కూతలు కూస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ భగ్గుమంది. అవన్నీ తప్పుడు కథనాలేనని కొట్టి పారేసింది. భారత్ తన వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని ఓ అంతర్జాతీయ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్ని దృష్టిలో పెట్టుకొనే, కేంద్ర ఆరోగ్యశాఖ మండిపడింది. ‘భారత్ తన వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. అది శుద్ధ అబద్ధం. వాస్తవ రూపానికి అదేమీ ప్రతిబింబం కాదు. ఈ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించడమే’ అని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
కోవిడ్కు వ్యతిరేకంగా ప్రపంచమంతా పోరాడుతోందని, అందులో భారత్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపింది. భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా పెద్దదని, అది సక్సెస్ కూడా అయ్యిందని స్పష్టం చేసింది. తక్కువ జనాభా ఉన్న పాశ్చాత్య దేశాల వ్యాక్సినేషన్ ప్రక్రియతో పోలిస్తే.. భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతమైన విజయం సాధించిందని కేంద్ర ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ఎన్నో మైలు రాళ్లను కూడా అధిగమించిందని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకూ మొదటి డోసు 90 శాతం పూర్తైందని, రెండో డోసు 65 శాతం పూర్తైందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.