న్యూఢిల్లీ, నవంబర్ 25: పాన్ కార్డులను పూర్తిగా డిజిటలీకరణ చేయాలని, ప్రతి పాన్ కార్డుకు క్యూఆర్ కోడ్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,435 కోట్లతో చేపట్టనున్న పాన్ 2.0 ప్రాజెక్టుకు సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాన్ కార్డులను ఉచితంగా అప్గ్రేడ్ చేసి, క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నట్టు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. చాలాకాలంగా వాణిజ్యవర్గాలు కోరుతున్నట్టుగా పాన్, టాన్ సేవలను కలిపేయనున్నట్టు, పూర్తిగా పేపర్లెస్, ఆన్లైన్ పద్ధతిలో కొత్త పోర్టల్ ప్రారంభించనున్నట్టు చెప్పారు.
దేశంలో వినూత్న ఆవిష్కరణలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అనుకూలమైన వ్యవస్థ ఏర్పాటు కోసం అటల్ ఇన్నొవేషన్ మిషన్(ఏఐఎం 2.0) కార్యక్రమానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2028 మార్చి 31 వరకు రూ.2,750 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నది. దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రోత్సహించేందుకు రూ.2,481 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
పరిశోధనలను ప్రోత్సహించేందుకు గానూ రూ.6,000 కోట్లతో ‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్సన్’ పథకానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పరిశోధకులకు ఒకే వేదికపై దేశంలోని అన్ని పరిశోధన పత్రాలు, జర్నళ్లు చదివేందుకు వీలు కలగనుంది. అరుణాచల్ ప్రదేశ్లో రూ.3,689 కోట్లతో చేపట్టనున్న రెండు జల విద్యుదుత్పత్తి కేంద్రాలకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.