న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులను పొందే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు ఆ అవార్డులను స్వీకరించేందుకు సంబంధిత అధికారుల నుంచి విధిగా ముందస్తు అనుమతి పొందాలని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఆయా ఉద్యోగులు పనిచేస్తున్న మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల కార్యదర్శుల నుంచి ఈ అనుమతులు పొందాలని తెలిపింది.
ప్రభుత్వ కార్యదర్శులు లేదా సెక్రటరీ ర్యాంకు అధికారులు ఈ అవార్డులను స్వీకరించాలంటే క్యాబినెట్ సెక్రటరీ నుంచి అనుమతి పొందాలని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులను స్వీకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులను అనుమతించాలని, ఆ అవార్డులు నగదు లేదా ఇతర సదుపాయాల రూపంలో ఉండకూడదని స్పష్టం చేసింది.
ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులెవరూ అవార్డులు తీసుకోకూడదని, ఉద్యోగులు తమ గౌరవార్థం జరిగే ప్రైవేటు కార్యక్రమాలకు హాజరు కాకూడదని 1964 నాటి సివిల్ సర్వీస్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఆ తర్వాతి కాలంలో ఈ నిబంధనలను పలుమార్లు మార్చారు. ప్రైవేటు ట్రస్టులు, ఫౌండేషన్ల నుంచి ఆర్థిక ప్రయోజనాలతో కూడిన అవార్డులను స్వీకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులను అనుమతించరాదని 2000 సంవత్సరంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉద్యోగులు సరిగా పాటించకపోవడంతో కేంద్రం తాజాగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఉద్యోగులంతా విధిగా పాటించి తీరాలని తేల్చిచెప్పింది.