న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఆస్తుల నగదీకరణ పేరు చెప్పి.. దేశంలోని 13 మేజర్ ఓడరేవులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం మేజర్ పోర్ట్స్ అథారిటీస్ యాక్ట్, 2021ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడిక.. మోదీ సర్కారు కన్ను మైనర్ పోర్టులపై పడింది. ఆయా పోర్టులపై పెత్తనం చెలాయించేందుకు ఇండియన్ పోర్ట్స్ బిల్లు-2022ను తీసుకురాబోతున్నది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఆగస్టులోనే విడుదల చేసింది. దీని ప్రకారం.. పోర్టులన్నీ కేంద్రం ఆధీనంలోకి వెళ్తాయి. రాష్ర్టాల ఆదాయానికి, అధికారాలకు కత్తెర పడుతుంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రం బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ కూడా రాశారు. రాష్ర్టాల ఆదాయానికి గండి పడుతుందని, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని లేఖలో పేర్కొన్నారు.
పాత చట్టాన్ని తొలగించి కొత్త చట్టం!
భారత ఓడరేవుల చట్టం-1908ను తొలగించి, 2022 చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. ఇది అమల్లోకి వస్తే మైనర్ పోర్టులన్నీ ఒకే రెగ్యులేటరీ (నియంత్రణ) వ్యవస్థ కిందకు వస్తాయని నిపుణులు అంటున్నారు. అప్పుడు కొత్త పోర్టులు కట్టుకోవాలా? వద్దా? అనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తుందని, ఇది రాష్ర్టాల అధికారాలకు కత్తెర వేసినట్టేనన్నారు. ఆస్తుల నగదీకరణ పేరుతో ప్రభుత్వరంగ ఆస్తులు అమ్మడంతో లక్షల మంది ఉ ద్యోగాలు కోల్పోయారని, ఇప్పుడు చిన్న తరహా పోర్టుల్లోనూ ఇదే దుస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
కొత్తగా నియంత్రిత వ్యవస్థ
పోర్టులన్నింటికీ కలిపి ఒకే నియంత్రిత వ్యవస్థ (మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎమ్ఎస్డీసీ)ను తీసుకురావాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను లాక్కొనే చర్యేనని మండిపడుతున్నారు. జీఎస్టీ కౌన్సిల్ మాదిరిగా సలహా మండలినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్రే ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పోర్టులను ప్రైవేట్ పరం చేసే చర్యల్లో భాగంగానే మోదీ సర్కారు ఈ బిల్లును తీసుకొస్తున్నదని చెబుతున్నారు.