న్యూఢిల్లీ, ఆగస్టు 14: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంట్రీ అవార్డులను ప్రకటించింది. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్)కు చెందిన మొత్తం 76 మంది పేర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు. వీరిలో నలుగురికి కీర్తిచక్ర(అందరికీ మరణానంతరం), 11 మంది శౌర్యచక్ర(ఐదుగురికి మరణానంతరం) ప్రదానం చేయనున్నారు. కీర్తిచక్ర గ్రహీతలు అందరూ సీఆర్పీఎఫ్కు చెందినవారే కావడం గమనార్హం. ఇద్దరికి బార్ టు సేనా మెడల్స్, 52 మందికి సేనా మెడల్స్, ముగ్గురికి నౌ సేన(నేవీ సేన) మెడల్స్, నలుగురికి వాయు సేన మెడల్స్ ప్రకటించారు. దేశ అత్యున్నత పీస్టైమ్ గ్యాలెంట్రీ అవార్డుల జాబితాలో అశోకచక్ర తర్వాత కీర్తి చక్ర, శౌర్య చక్ర రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. విధి నిర్వహణలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు ఈ గ్యాలెంట్రీ అవార్డులు ఇస్తారు.
నక్సల్స్పై పోరులో..
కీర్తిచక్ర అవార్డుకు ఎంపికైన నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్, హెడ్కానిస్టేబుల్ రాజ్కుమార్, కానిస్టేబుళ్లు బబ్లూ రభ, శంభు రామ్ ఓ నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో అమరులయ్యారు. 2021, ఏప్రిల్ 3న చత్తీస్గఢ్లోని బీజాపూర్లో జరిగిన చేపట్టిన ఆపరేషన్ టీమ్లో ఈ నలుగురు సభ్యులుగా ఉన్నారు. నక్సలైట్లు జవాన్లపై పెద్దయెత్తున కాల్పులకు దిగడంతో పాటు, ఐఈడీ దాడులకు పాల్పడ్డారు. ఈ సమయంలో ఈ నలుగురు నక్సల్స్ను ఓ వైపు దీటుగా ఎదుర్కొంటూనే.. తమ తోటి జవాన్లను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. జవాన్లు ఎంతో ధైర్యసాహసాలతో ప్రతిగా చేపట్టిన కాల్పులతో నక్సలైట్లు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. మొత్తంగా ఈ ఆపరేషన్లో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా, 31 మందికి గాయాలయ్యాయి.
230 మందికి శౌర్య పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 954 మందికి పోలీస్ పతకాలను ప్రకటించింది. ఇందులో 230 మంది బ్రేవరీ మెడల్స్ సహా ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ఫర్ గ్యాలెంట్రీ(పీపీఎంజీ) అందుకోనున్నారని కేంద్ర హోం శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. నక్సల్ ప్రభావిత రాష్ర్టాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడంలో కృషి చేసిన 125 మందికి, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న 71 మందికి, ఈశాన్య రాష్ర్టాల్లో తిరుగుబాటు వ్యతిరేక విధి నిర్వహణలో ఉన్న 11 మందికి బ్రేవరీ మెడల్ ఇవ్వనున్నారు. సీఆర్పీఎఫ్ అధికారి లౌక్ప్రాపమ్ ఇంబోచా సింగ్కు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ఫర్ గ్యాలెంట్రీ ప్రదానం చేయనున్నట్టు హోంశాఖ తెలిపింది.
కీర్తిచక్ర గ్రహీతలు (అందరికీ మరణానంతరం)
దిలీప్కుమార్ దాస్ ,రాజ్కుమార్ యాదవ, బబ్లూ రభ, శంభు రాయ్
శౌర్యచక్ర గ్రహీతలు
మేజర్ విజయ్ వర్మ, మేజర్ వికాస బంభు (మరణానంతరం), మేజర్ ముస్తఫా బొహరా (మరణానంతరం), మేజర్ సచిన నేగి, మేజర్ రాజేంద్ర ప్రసాద్ జట్, మేజర్ రవీందర్ సింగ్ రావత్, హవ్ వివేక్ సింగ్ తోమర్ (మరణానంతరం), నాయక్ బీమ్ సింగ్, రైఫిల్ మ్యాన్ కులభూషణ్ మంత (మరణానంతరం), సైఫుల్లా ఖాద్రి (మరణానంతరం), గమిత్ ముకేష్ కుమార్