దేశంలో బొగ్గు కొరతపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బొగ్గు కొరత లేదని ఒకవైపు చెబుతూనే.. సంక్షోభం తీవ్రమైన ఈ క్లిష్ట సమయంలో ఇప్పుడు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నది. మరోవైపు, బొగ్గు కొరత కారణంగా విద్యుత్తు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతున్నది. ఉత్తరాదినే కాకుండా దక్షిణాది రాష్ర్టాల్లో కూడా ఇప్పటికే విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దేశంలో బొగ్గు కొరత ఉన్నదా? లేక కార్పొరేట్ల కోసం కేంద్రం బొగ్గు సంక్షోభాన్ని కృత్రిమంగా సృష్టించిందా? తదితర అంశాలపై ప్రత్యేక కథనం..
దేశంలో బొగ్గు కొరత ముంచుకొచ్చిందని, రానున్న కొద్దిరోజుల్లో విద్యుత్తు కోతలు తప్పవని ఈ నెల మొదటి వారం నుంచే జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దేశంలోని 135 బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో.. నూటికిపైగా స్టేషన్లలో బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయని హెచ్చరించాయి. అయితే, ఈ వార్తలపై కేంద్రప్రభుత్వం స్పందించలేదు. వారం గడిచింది. 25కు పైగా థర్మల్ పవర్ ప్లాంట్లు మూతబడ్డాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, ఏపీ, అస్సాం, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో కరెంటు కోతలు మొదలయ్యాయి. విద్యుత్తు సంక్షోభంపై ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సైతం ఇదే అంశంపై కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. విపక్షాలు, సామాన్యులు, రాజకీయ విశ్లేషకులు, నిపుణుల నుంచి విమర్శలు పెరుగడంతో కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. దేశంలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయని, కొరత ఏమీ లేదంటూనే.. సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తుండటం గమనార్హం.
నిల్వలు ఉంటే.. అప్పుడు ఎందుకు స్పందించలేదు?
దేశంలో బొగ్గు నిల్వలపై ఆందోళన చెందవద్దని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం తెలిపారు. డిమాండ్కు సరిపడా బొగ్గు సరఫరాను పెంచుతున్నట్టు పేర్కొన్నారు. సోమవారం రికార్డు స్థాయిలో 1.95 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసినట్టు చెప్పారు. వానలు తగ్గుముఖంపట్టడంతో అక్టోబరు 21 లేదా అంతకంటే ముందే.. రోజుకు 2 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం కోల్ ఇండియా లిమిటెడ్ వద్ద 22 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. అయితే, దేశంలోని పవర్ ప్లాంట్లలో, మైనింగ్ కంపెనీలో నాలుగు రోజులకు సరిపడా కూడా బొగ్గు నిల్వలు లేవంటూ.. మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ, అప్పుడు స్పందించని కేంద్రం.. ప్రస్తుతం నిల్వలు ఉన్నాయని ప్రకటించడం సందేహాలకు తావిస్తున్నది.
సంక్షోభం లేదంటూనే.. రాష్ర్టాలకు సూచనలు
దేశంలో బొగ్గు-విద్యుత్తు సంక్షోభంపై కేంద్రప్రభుత్వం మంగళవారం రాష్ర్టాలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్తు’ను రాష్ర్టాలు వాడుకోవచ్చని పేర్కొంది. మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంటు’ సాయం చేయాలని కోరింది. వినియోగదారులకు విద్యుత్తు సరఫరా చేయకుండా.. కరెంటును అధిక ధరకు విక్రయించే రాష్ర్టాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలా చేసే రాష్ట్రాలకు ‘కేటాయించని విద్యుత్తు’ను ఉపయోగించుకునే వెసులుబాటును ఉపసంహరించి.. దాన్ని ఇతర రాష్ర్టాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. అయితే, దేశంలో బొగ్గు-విద్యుత్తు కొరత లేదంటూ పైకి చెబుతున్న కేంద్రం.. రాష్ర్టాలకు ఈ సూచనలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కేంద్రం చెబుతున్నది అవాస్తవం
ఏపీలో విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉన్నదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కరెంట్ కోతలు ఎక్కువగా ఉంటాయని.. అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్తు ధర కూడా పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో యూనిట్ ధర రూ.20 నుంచి రూ.25 వరకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధర పెరిగిపోయిందని, అధిక ధరకు బొగ్గు కొనాల్సి వస్తున్నదని తెలిపారు. బొగ్గు కొరత లేదంటూ కేంద్రప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. మరోవైపు, కేంద్రం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించకపోవడంవల్లే దేశంలో బొగ్గు సంక్షోభం తలెత్తిందని సీపీఎం మండిపడింది. ఇంకోవైపు, కోల్ ఇండియా సమయానికి తగినంత బొగ్గును సరఫరా చేయకపోవడంతో రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తిందని మహారాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ఆరోపించారు.
కొరత లేనప్పుడు సమీక్షలెందుకు?
బొగ్గు కొరత, విద్యుత్తు సంక్షోభంపై వస్తున్న వార్తలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. కొందరు అనవసరంగా భయాలను సృష్టిస్తున్నారని మండిపడింది. దేశంలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నట్టు పేర్కొన్నది. అయితే, పవర్ ప్లాంట్ల మూసివేత, పలు రాష్ర్టాల్లో విద్యుత్తు సంక్షోభం ఎందుకు నెలకొన్నదన్న విషయాలను మాత్రం వివరించట్లేదు. ఇదే సమయంలో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో.. కేంద్రహోంమంత్రి అమిత్ షా సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్తు డిమాండ్ తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కూడా మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. విద్యుత్తుశాఖ కార్యదర్శి అలోక్ కుమార్, బొగ్గుగనుల శాఖ కార్యదర్శి ఏకే జైన్ బొగ్గు-విద్యుత్తు నిల్వలపై ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. గూడ్స్ రైళ్ల సాయంతో పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసే ప్రత్యామ్నాయాలపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తున్నది. దేశంలో బొగ్గు సంక్షోభం లేనప్పుడు ఈ రివ్యూ సమావేశాలు ఎందుకని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బొగ్గు-విద్యుత్తు సంక్షోభంపై కేంద్రప్రభుత్వం నిజాలు దాస్తున్నదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వాళ్లకు మేలు చేయాలనేనా?
దేశంలోని ప్రధాన ప్రభుత్వ థర్మల్ప్లాంట్లు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ.. ప్రైవేటు పవర్ ప్లాంట్లయిన జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్, టాటా పవర్ కో. లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్లపై ఈ సంక్షోభం ఎంత మాత్రం ప్రభావం చూపడంలేదు. దీనికి కారణం.. ఇప్పటికే పెద్దమొత్తంలో ఆ కంపెనీలు విదేశీ బొగ్గును నిల్వచేసుకోవడమే. కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్ వేవ్ల నేపథ్యంలో విధించిన లాక్డౌన్ల కారణంగా చాలా పరిశ్రమలు, కంపెనీలు నెలలపాటు మూతపడ్డాయి. దీంతో ఆ మేరకు విద్యుత్తు వినియోగం తగ్గింది. విద్యుదుత్పత్తిలో వినియోగించే బొగ్గుకు డిమాండ్ తగ్గడంతో కార్పొరేట్ కంపెనీల దగ్గర నిల్వలు భారీగా పేరుకుపోయాయనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు ఇటీవల కాలంలో రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల దగ్గర భారీగా పేరుకుపోయిన నిల్వలను ప్రభుత్వ థర్మల్ ప్లాంట్లకు అధిక ధరలకు అమ్మించేందుకు కీలకస్థానాల్లో ఉన్న కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కృత్రిమ బొగ్గు కొరతను సృష్టించారనే వాదన కూడా వినిపిస్తున్నది.
కేంద్రాన్ని ఎందుకు సంప్రదించాలి?
అత్యవసర పరిస్థితుల కోసం ఏ రాష్ర్టాలకు కేటాయించని 15 శాతం విద్యుత్తును సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్) వద్ద కేంద్ర ప్రభుత్వం నిల్వచేస్తుంది. ఈ ‘కేటాయించని విద్యుత్తు’ను వాడుకోవచ్చని కేంద్రం తాజాగా రాష్ర్టాలకు సూచించింది. అయితే, దేశంలో బొగ్గు-విద్యుత్తు సంక్షోభం లేనప్పుడు.. రాష్ట్రప్రభుత్వాలు కేంద్రాన్ని ప్రత్యేకంగా సంప్రదించాల్సిన అవసరమేమిటని? విద్యుత్తు సరఫరాకు రెగ్యులర్ ప్రాసెస్ను ఆచరించవచ్చు కదా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.