న్యూఢిల్లీ, నవంబర్ 21: ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అదానీ అవినీతి అంశంపై వేడెక్కనున్నాయి. ఈ సమావేశాల్లో పెండింగ్లో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఆగస్టులో సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును ఉభయ సభల జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు. శీతాకాల సమావేశం ప్రారంభమైన తొలివారం ఆఖరిరోజు ఈ నివేదిక సమర్పించాలని గతంలోనే నిర్ణయించారు. దీంతో వారు నివేదిక ఇచ్చిన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపింది. అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టే కొత్త బిల్లుల జాబితాలో ఇది లేకపోయినప్పటికీ ఈ సమావేశంలోనే దీనిని కూడా ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐదు కొత్త బిల్లులలో కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ద ఇండియన్ పోర్ట్స్ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కో-ఆపరేటివ్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయ బిల్లు, పంజాబ్ కోర్ట్స్ (సవరణ) బిల్లు ఉన్నాయి.