దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. పాత వేరియంట్ కంటే ఇది 3 రేట్లు వేగంగా విజృంభిస్తుందని, అవసరమైన చర్యలకు ఇక ఉపక్రమించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ కేంద్రం లేఖలు రాసింది. దీనిని నియంత్రించడానికి వార్ రూమ్ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఒమిక్రాన్, డెల్టా వెరియంట్లు కూడా దేశంలో ఇప్పటికీ ఉందని, జిల్లా స్థాయిల్లో కూడా దూర దృష్టితో అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీటిని నియంత్రించడానికి వెంటనే పనులను కూడా ప్రారంభించాలని కోరింది. ఒమిక్రాన్ తమ తమ ప్రాంతాల్లోకి ప్రవేశించకంటే ముందే తగిన చర్యలకు ఉపక్రమించాలని హెచ్చరించింది.
ఒమిక్రాన్ను నియంత్రించడానికి అవసరమైతే నైట్ కర్ఫ్యూలను కూడా పెట్టాలని లేఖలో తేల్చి చెప్పింది. దీంతో పాటు ప్రజలు గుమిగూడకుండా చూడాలని, ప్రజా రవాణా విషయంలో ఓ కన్నేసి ఉంచుతూ నియంత్రించాలని, ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పన, అంబులెన్స్, ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చుకోడం లాంటివి చేసుకోవాలని కేంద్రం తెలిపింది. వీటన్నింటి కోసం ఎమర్జెన్సీ ఫండ్ ను కూడా ఉపయోగించుకోవాలని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది. ఇక ప్రతి రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా తగు చర్యలను చేపట్టాలని కూడా కేంద్రం తెలిపింది.