న్యూఢిల్లీ, నవంబర్ 15: దక్షిణాది రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఎంబీబీఎస్ సీట్ల పరిమితిపై కేంద్రం వెనుకడుగు వేసింది. మూడు నెలల క్రితం (ఆగస్టు16న) విడుదల చేసిన నూతన మార్గదర్శకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ‘నేషనల్ మెడికల్ కమిషన్'(ఎన్ఎంసీ) బుధవారం ప్రకటించింది. ‘ఎంబీబీఎస్ సీట్ల పరిమితిపై వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతాం. ఈ అంశంపై ఏకాభిప్రాయం రాగానే, 2025-26 నుంచి అమల్లోకి తీసుకొస్తాం. అప్పటివరకు కొత్త గైడ్లైన్స్ అమలును ఆపేస్తున్నాం’అని ఎన్ఎంసీ తాజాగా వెల్లడించింది. ఆగస్టు 16న ఎన్ఎంసీ జారీచేసిన గైడ్లైన్స్పై దక్షిణాది రాష్ర్టాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి 10 లక్షలమంది జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలని, పరిమితి మించితే కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించమంటూ ఎన్ఎంసీ జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి.
ఈ నిర్ణయంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్ఎంసీ మార్గదర్శకాలు అమల్లోకి వస్తే, ఆయా రాష్ర్టాల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు, కాలేజీల ఏర్పాటుకు కొన్ని దశాబ్దాలు పడుతుందని ఆగ్రహం వ్యక్తమైంది. వైద్య విద్యలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాష్ర్టాల హక్కుల్ని కేంద్రం హరిస్తున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. రాష్ర్టాలతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా కేంద్రం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటమేంటని కర్ణాటక ఆరోగ్యమంత్రి శరణ్ ఇటీవల ప్రశ్నించారు.