న్యూఢిల్లీ: అఖిల భారత రైతు సంఘం కార్యాలయంలో కిసాన్ నేతలు సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి నుంచి నిన్న సాయంత్రం చర్చలకు రావాలని పిలుపు రావడంతో ఇవాళ నేతల భేటీ అయ్యారు. ఇప్పటికే అయిదుగురు సభ్యులతో సంయుక్త కిసాన్ మోర్చా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం చర్చలకు పిలవడంతో.. ఏయే అంశాలను లెవనెత్తాలో అజెండా ఖరారు చేయనున్నారు. మధ్యాహ్నం 2గం.లకు సింఘూ సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు భేటీ కానున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రైతులపై నమోదు అయిన కేసులను ఎత్తివేసే ప్రతిపాదన కేంద్రం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వ ప్రతిపాదనను కిసాన్ సంఘాలు ఆమోదిస్తే.. అప్పుడు 15 నెలలుగా సాగుతున్న రైతు పోరాటం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొత్త సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఉభయసభల్లోనూ ఆ రద్దుకు చెందిన బిల్లులు కూడా పాసయ్యాయి.