(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): భారత్ సంచార్ నిగవ్ు లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను నిర్వీర్యం చేసి, సమూలంగా భూస్థాపితం చేసే దిశగా కేంద్రంలోని మోదీ సర్కారు యత్నిస్తున్నది. రూ.30 వేల కోట్ల బకాయిలను ఏండ్లకేండ్లు చెల్లించకుండా జాప్యం చేస్తూ సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన అనేక టెండర్లను ఉద్దేశపూర్వకంగా రద్దు చేసింది. ఉద్యోగుల వేతన సవరణ విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తూ.. సంస్థ నష్టాల పాలు కావటానికి ఉద్యోగులే కారణమంటూ కొత్త నాటకానికి తెరతీసింది. ఇలా బీఎస్ఎన్ఎల్ను బలిపశువును చేస్తూ ప్రైవేటురంగ టెలికం సంస్థలకు కేంద్రం మేలు చేకూరుస్తున్నది.
అక్టోబర్ 1, 2000న బీఎస్ఎన్ఎల్ కార్పొరేషన్గా మారింది. 2009 వరకూ ఏటా పది వేల కోట్ల వంతున లాభాలు గడిస్తూ వచ్చింది. దేశీయ టెలికం రంగంలో ప్రైవేటు ప్లేయర్ల అరంగేట్రంతో బీఎస్ఎన్ఎల్ వాటా తగ్గడం మొదలైంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో 3జీ సేవలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటికే వినియోగదారులు ప్రైవేటు ఆపరేటర్లకు మారడం మొదలెట్టారు. ఇక, మోదీ హయాంలో కంపెనీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. 2016 అక్టోబర్లో నిర్వహించిన 4జీ స్పెక్ట్రవ్ు వేలంలో బీఎస్ఎన్ఎల్ను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా పక్కనపెట్టి, ప్రైవేట్ ఆపరేటర్లను ప్రోత్సహించింది. 4జీ సేవలు అందుబాటులో లేకపోవటం వల్ల బీఎన్ఎస్ఎల్ మార్కెట్ షేర్, రెవెన్యూ మరింత దెబ్బతిన్నాయి. 4జీతో సంస్థకు ఎలాంటి ప్రయోజనం లేదని నీతిఆయోగ్తో చెప్పించింది. ఇక, 5జీ సేవలను ఇప్పటికే పలు ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు ట్రయల్ బేసిక్గా అందిస్తుండగా, 4జీ సేవలను కూడా పూర్తిస్థాయిలో బీఎస్ఎన్ఎల్ అందించలేకపోతున్నది. దీనికి కారణం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ (డీఓటీ) పెడుతున్న పలు నిబంధనలే. ఇక, కేంద్రం పెట్టిన కొర్రీలతో వేతన సవరణ వ్యవహారం కూడా 2017 నుంచి పెండింగ్లోనే ఉన్నది.
బీఎస్ఎన్ఎల్పై కేంద్రం వివక్ష చూపుతున్నది. సంస్థ నష్టాలకు ఉద్యోగులే బాధ్యులంటూ నిందలు మోపుతున్నది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించటానికి చర్యలు తీసుకుంటున్నది. డీఓటీ వైఖరితో బీఎస్ఎన్ఎల్ 4జీ స్పెక్ట్రవ్ును కోల్పోయింది. అనేక ‘సౌకర్యాల’ టెండర్లు రద్దయ్యాయి. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్.. వేల కోట్లు నెలల తరబడి విడుదల కాలేదు. వేతన సవరణ వ్యవహారాన్ని ప్రభుత్వం ఐదేండ్లుగా పట్టించుకోవటం లేదు
-బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్, యూనియన్ అధ్యక్షుడు అనిమీశ్ మిత్రా
జీవన వ్యయం పెరుగుతున్నది. మోదీ హయాంలో రూపాయి విలువ అంతకంతకూ తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో వేతన సవరణపై మౌనంగా ఉండటం వల్ల కలిగే నష్టాన్ని, పెన్షనర్ల ప్రయోజనాలను కేంద్రం ఆలోచించకపోవటం అమానుషం.
స్వపన్ చక్రవర్తి
-బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ మాజీ కార్యవర్గసభ్యుడు