బెంగళూరు, జనవరి 12: బీహార్లో ఇటీవల కొందరు దొంగలు బ్రిడ్జిలను, రైలింజన్ను దొంగలించిన వార్తల్ని చూసి ఆశ్చర్యపోయాం. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు కేటుగాళ్లు ఏకంగా మొబైల్ టవర్నే ఎత్తుకెళ్లారు. మహదేవపురాలోని గోశాల రోడ్లోని 50 అడుగుల పొడవు, 10 టన్నుల బరువున్న టవర్ను దొంగలించారు. అయితే దీనిని రాత్రికిరాత్రే దొంగలించలేదు. తాపీగా నెల రోజుల పాటు విప్పి ఒక్కొక్క సామానును తరలించారు. వారు చోరీచేసిన వాటిలో జనరేటర్, బ్యాటరీ బ్యాంక్ కూడా ఉన్నాయి. చోరీ అయిన టవర్ విలువ రూ.17 లక్షలు ఉంటుందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
సెల్ కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ టవర్ను 2009లో ఏర్పాటు చేశారు. దీనిని పర్యవేక్షించే టెక్నీషియన్ గత ఏడాది ఆగస్టులో రాజీనామా చేశాడు. అయితే కొత్త టెక్నీషియన్ సెప్టెంబర్లో వచ్చాడు. ఈ నెలరోజుల వ్యవధిని దొంగలు ఉపయోగించుకుని సెల్టవర్ను విప్పుకుని పోయారు. కొత్త టెక్నీషియన్ వచ్చి చూసేసరికి టవర్ స్థానంలో అక్కడ ఖాళీస్థలం కన్పించింది. దీంతో అతడు కంపెనీ అధికారులకు చెప్పగా వారు మహదేవపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు.