Gaganyaan Mission | చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి సరికొత్త చరిత్ర సృష్టించింది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రయోగానికి మిషన్కు సన్నద్ధమవుతున్నది. ప్రస్తుతం గగన్యాన్ మిషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మిషన్లో తొలిసారిగా అంతరిక్షయాత్ర చేపట్టనుండగా.. ఈ కీలకమైన ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. మిషన్ కోసం ఎల్వీఎం-3 లాంచ్ వెహికిల్ క్రయోజనిక్ ఇంజిన్ను ఇస్రో వాడనున్నది. సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ గగన్యాన్ మిషన్కు సిద్ధంగా ఉందని ఇస్రో తెలిపింది.
అనేక కఠినమైన పరీక్షల తర్వాత సీ20 క్రయోజనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని తెలిపింది. తొలి మానవసహిత ఫ్లయిట్ ఎల్వీఎం-3 జీ1 కోసం సిద్ధం చేసిన సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ అన్ని పరీక్షల తర్వాత సర్టిఫెకెట్ పొందిందని.. ఈ ప్రక్రియ ఈ నెల 13న చివరి దశ క్వాలిఫికేషన్ పరీక్షలు పూర్తయ్యిందని బుధవారం ఇస్రో ప్రకటించింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి ఎల్విఎం3 రాకెట్కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ మానవ రేటింగ్లో ప్రధాన మైలురాయిని సాధించిందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది.
మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించిన వాక్యూమ్ ఇగ్నిషన్ పరీక్షల శ్రేణిలో ఇది ఏడోది. ఇదిలా ఉండగా.. 2024 గగన్యాన్కు సన్నాహక సంవత్సరమని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొన్నారు. గగన్యాన్ మిషన్ కోసం హెలీకాప్టర్ నుంచి డ్రాప్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో ప్యారాచూట్ సిస్టమ్ను టెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. దాంతో పాటు పలు డ్రాప్ టెస్టులు నిర్వహించన్నుట్లు పేర్కొన్నారు. వీటితో పాటు పలు వాల్యుయేషన్ పరీక్షలు సైతం జరుగుతాయన్నారు.
గగన్యాన్ మిషన్లో ఇస్రో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నది. ముగ్గురు వ్యోమగాములను దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తయిన కక్ష్యలోకి చేర్చి.. తిరిగి వారిని భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం మూడు రోజులపాటు జరుగనున్నది. వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది. ఈ మిషన్ను 2025లో చేపట్టాలని భావిస్తున్నది. వాస్తవానికి 2022లోనే ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయితా పడుతూ వచ్చింది. ఇస్రో చేపట్టిన మిషన్ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది.